రాశి ఖన్నా లాభపడింది ఏముంది

విడుదల ముందు వరకు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్లలో హీరోయిన్ రాశి ఖన్నా విస్తృతంగా పాల్గొంది. ఇంటర్వ్యూలు ఇచ్చింది. ప్రెస్ మీట్లకు వచ్చింది. చిన్న రీల్స్ చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి గొప్పగా చెప్పుకుంది. శ్రీలీల మెయిన్ హీరోయిననే ప్రచారం ముందు నుంచి జరిగినప్పటికీ హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నాకు కూడా తగినంత ప్రాధాన్యం ఉంటుందని అందరూ భావించారు. కానీ తీరా ఫ్యాన్స్ సినిమా చూశాక నీరసం వచ్చేసింది. కారణం ఆమె పాత్ర తేలిపోవడమే.

కేవలం ఫస్ట్ హాఫ్ కు మాత్రమే పరిమితం కావడం, అది కూడా మానసిక సమస్య ఉన్న ఒక సైకో పేషెంట్ గా నటించడం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. పైగా లుక్స్ కూడా సోసోగా అనిపించాయి. కాలర్ ఎత్తరా పాటలో పవన్ కళ్యాణ్ తో కలిసి డాన్స్ చేసిన ఆనందం రాశిఖన్నాకు ఉండొచ్చేమో కానీ నిజానికి దాని వల్ల తనకు కలిగిన ప్రయోజనం సున్నానే. ఎందుకంటే పవన్ డాన్సులే జస్ట్ ఓకే అనిపించినప్పుడు ఇక రాశి హైలైట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది.

పోనీ సెకండాఫ్ లో ఏమైనా రీ ఎంట్రీ ఇప్పించి పాట లాంటిది పెట్టి, శుభం కార్డుకు ముందు పెళ్లి చేశారా అంటే అదీ లేదు. ఆ అవకాశం ఉన్నా దర్శకుడు హరీష్ శంకర్ లైట్ తీసుకున్నారు. కథ వినకుండా ఈ సినిమా చేశానని రాశిఖన్నా చెప్పుకోవడం బాగానే ఉన్నా కెరీర్ పరంగా ఎలాంటి ప్లస్ కాలేనప్పుడు ఇంకొంచెం క్యారెక్టర్ నిడివిని పెంచమని అడిగి ఉండాల్సింది. గత ఏడాది సిద్దు జొన్నలగడ్డతో చేసిన తెలుసు కదా కూడా రాశిఖన్నాకు నిరాశ మిగిల్చింది.

ఇక్కడి సంగతి ఎలా ఉన్నా రాశిఖన్నా చేతిలో మూడు బాలీవుడ్ సినిమాలు, ఒక తమిళ మూవీ ఉన్నాయి. 2013లో తను తొలిసారి తెరంగేట్రం చేసింది హిందీలోనే. మద్రాస్ కేఫ్ లో జాన్ అబ్రహంతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అక్కడ బిజీ కావడం విచిత్రమే. టాలీవుడ్ లో మాత్రం తను కొత్తగా కమిటైన ప్రాజెక్టులు లేవు. రెండు మూడు చర్చల దశలో ఉన్నాయి. ఏది ఏమైనా ఉస్తాద్ భగత్ సింగ్ వల్ల ఎవరు లాభపడ్డారనేది పక్కనపెడితే రాశికి దక్కింది మాత్రం జీరోనే.