ఉస్తాద్ మనసు ఎందుకు మారిందంటే

హఠాత్తుగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19కి ప్రీ పోన్ అయ్యిందన్న వార్త ఒక్కసారిగా నిన్న సాయంత్రం సోషల్ మీడియాని కుదిపేసింది. ఉదయం టాక్సిక్ వాయిదా న్యూస్ హల్చల్ తగ్గకముందే పవన్ కళ్యాణ్ టీమ్ షాక్ ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. సరే ఇంత హడావిడిగా వారం ముందుకు జరిగి, రీ రికార్డింగ్ బాధ్యతలు దేవిశ్రీ ప్రసాద్ కు బదులు తమన్ కు ఎందుకు ఇచ్చారనే అనుమానాలు ప్రేక్షకుల్లో లేకపోలేదు. దానికి స్పష్టమైన కారణాలున్నాయి.

మార్చి మూడో వారం ఉగాది, రంజాన్ పండగలు రెండు ఒకేసారి వచ్చాయి. నాలుగు రోజుల సుదీర్ఘమైన వీకెండ్ పిల్లా పెద్దా అందరూ సెలవుల్లో ఉంటారు. వాళ్ళలో అధిక శాతం జనం థియేటర్ ఎంటర్ టైన్మెంట్ కోరుకుంటారు. అప్పుడు కనిపించే ఏకైక ఆప్షన్ పవర్ స్టార్ మూవీ. ఒకవేళ దురంధర్ 2 రివెంజ్ పోటీలో ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో దానికున్న ఆడియన్స్ వేరు. ఫ్యామిలీస్ దాని వైపు వెళ్లవు. దానికి తోడు మార్చి చివరి వారం ఖాళీగా ఉంది.

ఆ వారంలో శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, శని ఆదివారాలు ప్లస్ అవుతాయి. ఒకవేళ టికెట్ రేట్ల పెంపు కనక ఉస్తాద్ భగత్ సింగ్ తీసుకుంటే పది రోజుల పాటు పెంచిన ధరలతో ఊహించని స్థాయిలో రికార్డు నెంబర్లు నమోదు చేయొచ్చు. ఒకవేళ జిఓ తీసుకోకపోయినా రికార్డుల మోత అయితే ఖాయం. బాగుంది అనే టాక్ వస్తే కలెక్షన్లు ఎక్కడికో వెళ్లిపోతాయి. యావరేజ్ అన్నా చాలు పవన్ కళ్యాణ్ ర్యాంపేజ్ ఖచ్చితంగా ఇంకో లెవెల్ లో ఉంటుంది. ఏతావాతా చూసుకుంటే ఏప్రిల్ 10 దాకా సిచువేషన్ ఇలాగే ఉంటుంది.

ఇంత మంచి అవకాశం ఉస్తాద్ భగత్ సింగ్ కి మళ్ళీ రాదు. సో దాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో మైత్రి మూవీ మేకర్స్ బృందం మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ తీసుకుంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం వెళ్ళిపోయింది. ఇవాళ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావొచ్చు. దురంధర్ 2 వచ్చినా రాకపోయినా ఈ విధంగా ప్రొసీడ్ అవ్వాలని డిసైడ్ అయ్యారట. కాకపోతే బాలన్స్ డబ్బింగ్, రీ రికార్డింగ్ ఆఘమేఘాల మీద పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. ఇంకా సెన్సార్ కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకో పది రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అయిపోవాలి. అందుకే ఈ ఉరుకులు పరుగులు.