అల్లూ వారి పుష్ప కథ బెడిసికొట్టిందా?

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ మనం అవెంజర్స్, ట్రాన్స్ఫార్మర్స్ లాంటి సినిమాలు తీయనవసరం లేదని, రూట్స్ లోకి వెళ్ళిపోయి చిన్న చిన్న ఊళ్ళలో జరిగే నిజ జీవిత గాథలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలని అన్నారు. దానికి ఉదాహరణగా కాంతార, పుష్పలను ప్రస్తావించారు. కాంతార విషయంలో ఒప్పుకోవచ్చు. ఎందుకంటే కర్ణాటకకు మాత్రమే పరిమితమైన ఒక గ్రామ దైవం గొప్పదనాన్ని, మహత్యాన్ని దర్శకుడు కం హీరో రిషబ్ శెట్టి చాలా సహజంగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆమోదించేలా చేశారు.

కానీ పుష్ప కేసు వేరు. రెండు వేల కోట్ల వసూళ్లు వచ్చి ఉండొచ్చు. కానీ అది ఎర్ర చందనం దొంగతనం బ్యాక్ డ్రాప్ లో తీసింది. పుష్ప రాజ్ అనే స్మగ్లర్ వేల కోట్లకు అక్రమ మార్గంలో ఎలా పడగెత్తాడు అని దర్శకుడు సుకుమార్ చూపించారు. కావాల్సినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, బోలెడు మసాలాలు పుష్కలంగా దట్టించారు. ఇందులో స్ఫూర్తి పొందడానికి ఏమీ లేదు. పైగా హీరో పాత్ర జెంటిల్ మెన్ లో అర్జున్ లా మెడికల్ కాలేజీలు కట్టించి వందల కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టదు. కుటుంబం కోసం పోరాడుతుంది తప్ప సమాజం కోసం కాదు. అలాంటపుడు ఇది రూటెడ్ స్టోరీ ఎలా అవుతుందనేది నెటిజెన్ల కామెంట్.

లాజికల్ గా చెప్పాలంటే వీరప్పన్ లాంటి అడవి దొంగలను తుదముట్టించిన పోలీస్ ఆఫీసర్ల స్టోరీలు ఇన్స్ పిరేషన్ అవుతాయి తప్ప పుష్ప లాంటి స్మగ్లర్ల కథలు కాదనేది ఒక వాదన. మరి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డు ఇచ్చింది కదాని అనొచ్చు. దాని కాంటెక్స్ట్ వేరు. నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు. అది నటన కోణంలో. బలగం, రాజు వెడ్స్ రాంబాయి, కలర్ ఫోటో లాంటివి రూటెడ్ కథలు అవుతాయి కానీ పుష్ప వేరే క్యాటగిరీలోకి వస్తుందనేది కాదనలేని వెర్షన్. ట్విస్ట్ ఏంటంటే హాలీవుడ్ రేంజ్ సినిమాలు వద్దని అల్లు అరవింద్ అంటున్నారు కానీ ఇప్పుడు అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న మూవీ ట్రాన్స్ ఫార్మర్స్, అవెంజర్స్ క్యాటగిరీనే.