లియో నుంచి కిష్కిందపురి దాకా

ఇటీవలే విడుదలైన కిష్కిందపురిలో విలన్ గా నటించిన శాండీ మాస్టర్ రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్లకు సుపరిచితుడే. లియోలో కాఫీ అంటూ భయపెట్టే లుక్స్ తో అదరగొట్టిన ఈ విలక్షణ నటుడి వెనుక చెప్పుకోదగ్గ కథే ఉంది. 2005లో కొరియోగ్రాఫర్ గా ఇతను చిత్ర సీమకు వచ్చాడు. ఒకప్పుడు యాంకర్ ఓంకార్ తెలుగులో హోస్ట్ చేసిన ఛాలెంజ్ రియాలిటీ షోలో నృత్య దర్శకుడిగా పని చేశాడు. కూలీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ లో ఒకటైన మౌనిక మౌనికలో సౌబిన్ షాహిర్, పూజా హెగ్డేలతో స్టెప్పులు వేయించింది ఈ శాండీనే. దగ్ లైఫ్, తంగలాన్, విక్రమ్, ఆవేశం తదితర సూపర్ సూపర్ హిట్స్ కు వర్క్ చేశాడు.

సైకో పాత్రలకు బెస్ట్ ఛాయస్ గా నిలుస్తున్న శాండీ మాస్టర్ తాజాగా కిష్కిందపురిలో మరోసారి అదరగొట్టాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో విశ్వరూపం చూపించేశాడు. భయపెట్టే లుక్స్, విచిత్రమైన రూపం, ఎక్స్ ప్రెషన్స్ కంటెంట్ ని నిలబెట్టాయి. ఒకరకంగా చెప్పాలంటే హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఓ ఇరవై నిమిషాల పాటు కనిపించకపోయినా ఆ లోటుని పూర్తిగా తీర్చింది శాండీనే. ఇతని జీవితంలో రెండు పెళ్లిళ్లు ఉన్నాయి. 2009లో నటి కాజల్ పశుపతిని చేసుకుని మూడు సంవత్సరాలకే విడాకులు ఇచ్చాడు. తిరిగి 2017లో సోషల్ మీడియా సెలబ్రిటీ దొరతి స్లవియాని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు.

ప్రస్తుతం ఈ శాండీ మలయాళంలో రూపొందుతున్న అనుష్క కథనర్ తో పాటు తమిళ చిత్రం బ్లాబ్లాబ్లాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నాడు. ఇతని డిమాండ్ కొరియోగ్రాఫర్, యాక్టర్ రెండు రకాలుగా పెరుగుతూ పోవడం గమనార్హం. అయినా ఒక్కసారి ఆర్టిస్టుగా బ్రేక్ దక్కాక వచ్చే కిక్కు వేరే లెవెల్ లో ఉంటుంది. అన్నట్టు కొత్త లోకలో కళ్యాణి ప్రియదర్శిని తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న పోలీస్ కం విలన్ క్యారెక్టర్ దక్కించుకున్న శాండీ లిస్టులో ఇప్పటిదాకా ఒక్క ఫ్లాపు లేకపోవడం గమనార్హం. కిష్కిందపురి పుణ్యమాని టాలీవుడ్ నుంచి కూడా చెప్పుకోదగ్గ ఆఫర్లు వస్తున్నాయట. అంటే ఇకపై రెగ్యులర్ గా శాండీని చూడబోతున్నాం.