టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక, సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసేవారికి అనసూయ ఇచ్చే కౌంటర్లు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. అయితే, అనసూయ హిందూ ధర్మం, సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెను దుమారం రేగుతోంది. హిందూ ధర్మాన్ని అనసూయ అవమానించారంటూ కొందరు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై అనసూయ తనదైన శైలిలో స్పందించారు.
తన మాటలను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అనసూయ అన్నారు. తాను ఏ మతాన్ని కించపరచలేదని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని చెప్పారు. తాను సనాతన ధర్మాన్ని పాటించే పక్కా హిందువునని, తన ధర్మం, విశ్వాసాల పట్ల తనకు ఎలాంటి అనుమానం లేదని స్పష్వ చేధీరు. పదిహేనేళ్లుగా సోషల్ మీడియాలో ఉన్నానని, ఈ ట్రోల్స్, వక్రీకరణలు తనకు కొత్త కాదని అన్నారు. తాను చెప్పిన అసలు విషయాన్ని పక్కన పెట్టి, వారికి కావాల్సిన కామెంట్స్ వరకు కట్ చేసి వైరల్ చేస్తున్నారని చెప్పారు.
తాను ఏ సందర్భంలో ఏం వ్యాఖ్యలు చేశానో పూర్తిగా చూడాలని, ఆ తర్వాత తనను విమర్శించాలని కోరారు. అలా కాకుండా తాను సనాతన ధర్మాన్ని అవమానించినట్లు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. తాను హనుమంతుడి భక్తురాలినని, శ్రీరాముడినే కొలుస్తానని, తన పెద్ద కుమారుడికి హనుమంతుడి పేరు పెట్టుకున్నానని చెప్పారు.
‘జై శ్రీరామ్’ అనే నినాదం ముసుగులో కొందరు దాడులకు తెగబడుతున్నారని గతంలో అనసూయ ఓ సందర్భంలో అన్నారు. కేవలం నినాదాలు చేయడం కంటే వ్యక్తుల ప్రవర్తనే ముఖ్యమని చెప్పారు. సనాతన ధర్మం పేరుతో దాడులు చేయడం సరికాదని ఆమె గతంలో హితవు పలికారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates