మైత్రీ సినిమాలన్నీ గతంలోకే వెళ్తున్నాయే!

మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే కూడా గతాన్ని రీక్రియేట్ చేసే పీరియడ్ వరల్డ్స్‌కే ఈ సంస్థ ఎక్కువ ఓటేస్తోంది. ఒకే ప్రొడక్షన్ హౌస్ ఒకే సమయంలో వేర్వేరు కాలాల్లో సాగే భారీ ప్రాజెక్టులను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లడం సినీ లవర్స్‌లో మంచి క్యూరియాసిటీ పెంచుతోంది.

ఇందులో విజయ్ దేవరకొండ ‘రణబలి’ సినిమా 19వ శతాబ్దపు నాటి రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే పీరియడ్ యాక్షన్ డ్రామా. ఆ కాలాన్ని తెరపై న్యాచురల్‌గా చూపించడానికి డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ రెండున్నరేళ్లు గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ చేశాడు. పాత రికార్డులు, నాటి ఆచారాలు, స్థానిక కథలను లోతుగా స్టడీ చేసి ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నట్లు చెప్పాడు.

ఇక ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ‘ఫౌజీ’ కూడా స్వాతంత్ర్యానికి పూర్వం నాటి కథతోనే వస్తోంది. బ్రిటిష్ కాలం నాటి తిరుగుబాటు నేపథ్యంలో సాగే ఈ ప్రాజెక్ట్ కోసం భారీ కాన్వాస్‌ను డిజైన్ చేస్తున్నారు. నాటి మిలిటరీ సెటప్, ఆ కాలపు పరిస్థితులను కళ్లముందు ఉంచేలా ఈ వింటేజ్ ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ‘డ్రాగన్’ కూడా పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లోనే రానుంది. ఈ సినిమా కథ 1960ల కాలం నేపథ్యంలో సాగుతుందనే సమాచారం ఉంది. ఇక బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా ‘NBK111’ను సైతం చారిత్రక యాక్షన్ డ్రామాగానే అనౌన్స్ చేశారు. కానీ మళ్ళీ ఆ కథ కాకుండా దర్శకుడు మరొక దాన్ని లైన్ లో పెట్టాడు. కానీ భవిష్యత్తులో గోపి మళ్ళీ ఆ కథను లైక్ లోకి తెస్తాడో లేదో చూడాలి. 

మైత్రీకి పీరియడ్ సినిమాలు కొత్తేమీ కాదు. గతంలో ‘రంగస్థలం’తో 1980ల నాటి వాతావరణాన్ని చాలా పర్ఫెక్ట్‌గా స్క్రీన్ మీదకు తెచ్చారు. పుష్ప సినిమా కూడా అలాంటి టైమ్ లైన్ లోనిదే. అయితే అప్పుడు ఏడాదికి ఒక సినిమాకే పరిమితమైన ఈ జోన్, ఇప్పుడు ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోలతో వేర్వేరు చారిత్రక కాలాలను ఒకేసారి తెరపైకి తెచ్చే స్థాయికి వెళ్లింది. ఇలాంటి సినిమాలు చేయాలంటే సెట్స్, లొకేషన్లు, ప్రాప్స్, ప్రొడక్షన్ డిజైన్ పరంగా చాలా ఎక్కువ ప్లానింగ్ అవసరం పడుతుంది. అలాంటిది ఒకే సమయంలో నాలుగు భారీ పీరియడ్ ప్రపంచాలను ఒకే బ్యానర్ హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి బిజినెస్ చేస్తారో చూడాలి