వెంకటేష్ ప్రయాణానికి అప్పుడే 40 ఏళ్ళు

సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజు 1986 సంవత్సరం ఆగస్ట్ 14 కలియుగ పాండవులు రిలీజయ్యింది. మాములుగా స్టార్ హీరోల వారసులు తెరకు పరిచయం కావడం సహజంగా జరిగేదే. కానీ ఒక అగ్ర నిర్మాత కొడుకు ఇండస్ట్రీ రావడం, అది కూడా అమెరికాలో చదువుకుని తెలుగు నేలపై అడుగు పెట్టడం గురించి అప్పట్లో తీవ్రంగా చర్చించుకున్నారు. ఆయనే రామానాయుడు గారి అబ్బాయి దగ్గుబాటి వెంకటేష్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్నారు.  

చిరంజీవి, బాలకృష్ణ స్టార్లుగా ఎదుగుతున్న క్రమంలో ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో వంద సినిమాలు చేయకపోయినా తనదైన ముద్ర వేయడంలో విజయం సాధించారు. కె విశ్వనాథ్ స్వర్ణకమలంతో నటనకు మెరుగులు దిద్దుకుని, సురేష్ కృష్ణ తీసిన ప్రేమతో నంది అవార్డు తెచ్చుకుని, బొబ్బిలి రాజాతో మాస్ ఇమేజ్ సాధించి, చంటితో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి కేవలం ఆరేడేళ్లకే సుస్థిర స్థానం సంపాదించుకోవడం అరుదైన ఘనతగా చెప్పాలి.

అలాని వెంకటేష్ ప్రయోగాలకు దూరంగా ఉండలేదు. పెళ్లి చేసుకుందాంలో హీరోయిన్ పాత్ర విలన్ చేతిలో మానభంగానికి గురయ్యే రిస్కీ సబ్జెక్టుని ఒప్పుకున్నారు. ప్రేమించుకుందాం రాలో కాలేజీ స్టూడెంట్ గా మెప్పించారు. స్వంత బ్యానర్ లో కలిసుందాం రా మూవీతో అన్ని వర్గాలకు మరింత దగ్గరయ్యారు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటివి క్లాసిక్స్ నిలవడమే కాదు వాటికి లెక్కలేనన్ని సార్లు రిపీట్ వేల్యూ రావడంలో వెంకటేష్ నటన ఎంతో దోహదం చేసింది.

ఆరు పదుల వయసులోనూ చలాకీగా ఎఫ్ 2, సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్స్ తో యాక్టివ్ గా ఉన్న వెంకటేష్ వంద సినిమాల మైలురాయి చేరుకోవాలనేది ఫ్యాన్స్ కోరిక. అంటే ఇంకో ఇరవై పైనే చేయాలి. అసాధ్యం కాదు కానీ ఏజ్ ఫాక్టర్ చూసుకుంటే వేగం పెంచితే ఈజీగా అందుకోవచ్చు. 2027 సంక్రాంతికి మరోసారి అనిల్ రావిపూడి డైరక్షన్లో వస్తున్న వెంకటేష్ ఈసారి కళ్యాణ్ రామ్ తో చేతులు కలిపారు. దీనికన్నా ముందు త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం మీద భారీ అంచనాలున్నాయి.