సూర్య గొప్పదనానికి ఇంతకంటే రుజువేముంది?

తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్ల నుంచి సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నప్పటికీ సూర్య నటుడిగా మాత్రం ఎప్పుడూ ఫెయిలవలేదు. అందుకే తన ఫాలోయింగ్ ఇంకా చెక్కు చెదరలేదు. సూర్యను ప్రేక్షకులు ఎంతో ఇష్టపడడానికి వ్యక్తిగతంగా తనకున్న మంచి పేరు కూడా ఒక కారణం. సామాజిక సమస్యల మీద గళం విప్పుడతాడు. ప్రకృతి విపత్తులు వచ్చినపుడు, వేరే సందర్భాల్లో బాధితులకు ఉదారంగా సాయం చేయడానికి ముందుకు వస్తాడు.
ఇవన్నీ ఒకెత్తయితే.. అగరం అనే ఫౌండేషన్ నెలకొల్పి అతను చేస్తున్న సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే.

మనుషుల జీవితాలను మార్చే అతి పెద్ద ఆయుధం చదువే అని బలంగా నమ్మే సూర్య.. ఈ ఫౌండేషన్ ద్వారా వందల మందిని చదివిస్తున్నాడు. పేదలు, అనాథలను ఎంపిక చేసి వారికి కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడు సూర్య. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది సూర్య కుటుంబం. అగరం ఫౌండేషన్ నడిపే స్కూల్ కోసం తమ ఇంటినే ఇచ్చేసిన ఔన్నత్యం సూర్య ఫ్యామిలీది.
తాజాగా ఈ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమం సూర్య గొప్పదనాన్ని ప్రపంచానికి చాటింది.

ఈ సంస్థ ద్వారా ఇప్పటిదాకా 8 వేలమంది చదువు పూర్తి చేశారట. అందులో 1800 మంది ఇంజినీర్లు ఉన్నారట. అగరం ద్వారా డాక్టర్లయిన వారి సంఖ్య 51. వీళ్లందరూ అగరం నిర్వహించిన కార్యక్రమంలో స్టేజ్ మీదికి వచ్చారు. అగరం ద్వారా తమ జీవితాలు ఎలా మారాయో వాళ్లు చెబుతుంటే.. సూర్య తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆడిటోరియంలో ఉన్న వాళ్లందరి కళ్లూ తడి అయిపోయాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సూర్య చేస్తున్న గొప్ప పనికి మరోసారి నెటిజన్లు అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి లోక నాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరైన సూర్య సేవను కొనియాడారు.