అసలే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. కొత్త సినిమాలకు వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. బడ్జెట్లేమో పెరిగిపోతున్నాయి. బిజినెస్ అనుకున్నంతగా జరగట్లేదు. రిలీజయ్యే వంద సినిమాల్లో ఐదారు లాభాలు తెచ్చిపెట్టడం కూడా గగనం అయిపోతోంది. దీంతో నిర్మాతల పరిస్థితి అగమ్య గోచరం అవుతుంటే.. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు అన్నట్లుగా జీతాల పెంపు కోసం సినీ కార్మికులు స్ట్రైక్కు పిలుపునివ్వడం పెద్ద షాక్.
30 శాతం మీద జీతాలు పెంచితే తప్ప పని చేయబోమంటూ నిన్ననే తెలుగు ఫిలిం ఫెడరేషన్ పిలుపునివ్వగా.. వెంటనే టాలీవుడ్లో షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రీకరణ జరపడం వివాదాస్పదం అయింది. ఇక్కడ సినీ కార్మికులు స్టైక్లో ఉండడంతో నిర్మాతలు.. చెన్నై నుంచి తమిళ వర్కర్లను రప్పించుకుని షూటింగ్ జరిపారు.
ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ లేక లేక డేట్లు ఇవ్వడంతో గత కొన్ని వారాలుగా చకచకా చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం షూట్ చివరి దశలో ఉంది. పవన్ మరి కొన్ని రోజులు పని చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఆయన అందుబాటులో ఉండరు. ఆయన ఇచ్చిన తక్కువ డేట్లనే సర్దుబాటు చేసుకుని షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండడంతో.. టీం బ్రేక్ లేకుండా పని చేస్తోంది. ఇలాంటి సమయంలో స్టైక్ రూపంలో ‘ఉస్తాద్’ టీం మీద బాంబు పడింది. షూటింగ్ ఆపే పరిస్థితి లేకపోవడంతో నిర్మాతలు చెన్నై నుంచి కార్మికులను రప్పించుకున్నారు. ఇది తెలిసి ఇక్కడి ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న చోటికి రావడం.. అక్కడ వాగ్వాదం చోటు చేసుకోవడం.. గొడవ కాస్త పెద్దది కావడం జరిగినట్లు ఆ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates