కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ వాంటెడ్ హీరో కమ్ డైరెక్టర్ అయిపోయాడు రిషబ్ శెట్టి. అంతకుముందే అతను నటుడిగా, దర్శకుడిగా మంచి మంచి సినిమాలు చేసినా.. ‘కాంతార’తో వచ్చిన గుర్తింపే వేరు. ఈ సినిమా అసాధారణ విజయాన్నందుకోవడంతో బహు భాషల్లో అతడికి అవకాశాలు వరుస కట్టాయి. అవన్నీ కూడా భారీ ప్రాజెక్టులే. తెలుగులో ఇప్పటికే అతను ప్రధాన పాత్రలో ‘జై హనుమాన్’ సినిమాను అనౌన్స్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. మరోవైపు హిందీలో ఛత్రపతి శివాజీ బయోపిక్ చేస్తున్నాడు రిషబ్.
ఇప్పుడు తెలుగులో రిషబ్ కథానాయకుడిగా మరో చిత్రం అనౌన్స్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్లలో ఒకరైన సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని అశ్విన్ గంగరాజు గుణ్ణం డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రి లుక్ పోస్టర్ను ఈ రోజే రిలీజ్ చేశాడు. ఇదొక యుద్ధ వీరుడి కథ అని.. భారీ స్థాయిలో తెరకెక్కబోతోందని ప్రి లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇంకా టైటిల్ ఖాయం చేయని ఈ సినిమాకు ‘ది ల్యాండ్ బర్న్డ్ ఎ రెబల్ రోజ్’ అని క్యాప్షన్ మాత్రం పెట్టారు. ఇదొక విప్లవ వీరుడి కథ అని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నాడు నాగవంశీ.
లెజండరీ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గుణ్ణం గంగరాజు తనయుడైన అశ్విన్ గంగరాజు ఇంతకుముందు ‘ఆకాశవాణి’ అనే సినిమా తీశాడు. అదొక ప్రయోగాత్మక కథతో తెరకెక్కిన సినిమా. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఆ చిత్రం కరోనా టైంలో నేరుగా ఓటీటీలో రిలీజైంది. అది పెద్దగా జనాల దృష్టిలో పడలేదు. ఇలాంటి సినిమా తీసిన దర్శకుడిని నమ్మి ఒక మోస్ట్ వాంటెడ్ యాక్టర్, పెద్ద నిర్మాణ సంస్థ కలిసి భారీ బడ్జెట్లో సినిమా చేయడానికి సిద్ధమవడం విశేషమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates