మొఘల్ దుర్మార్గాన్ని ఎదిరించిన యోధుడు

ఇంకో రెండు రోజుల్లో హరిహర వీరమల్లు థియేటర్లలో అడుగు పెట్టనుంది. జూలై 23 రాత్రే ప్రీమియర్ షోలు వేయనుండటంతో అభిమానుల ఎగ్జైట్ మెంట్ అంతకంతా పెరుగుతూ పోతోంది. మొన్నటిదాకా బజ్ పెద్దగా లేదనిపించినా ట్రైలర్ నుంచి క్రమంగా లెక్కలు మారుతూ వస్తున్నాయి. నిధి అగర్వాల్ ఇంటర్వ్యూలు, నిర్మాత ఏఎం రత్నం పంచుకుంటున్న విశేషాలు, దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పిన కబుర్లు ఒక అంచనాకు వచ్చేందుకు దోహదపడ్డాయి. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ దాన్ని మరికొంచెం పైకి తీసుకెళ్లింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కథకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్పేశారు.

ఒరిజినల్ కథను ముందు దర్శకుడు క్రిష్ పవన్ దగ్గరికి తీసుకొచ్చారు. కాకపోతే ఇది ఒక్క భాగంతో చెప్పలేమని రెండు పార్ట్స్ అవసరమవుతాయని కొంత షూటింగ్ జరిగాక మార్పులకు శ్రీకారం చుట్టారు. కొల్లూరులో ఉండే కోహినూర్ వజ్రం హైదరాబాద్ లో సుల్తాన్ దగ్గరకు చేరుకుంటుంది. మొఘలుల దుర్మార్గాలు పెట్రేగినప్పుడు వాళ్ళమీద తిరుగుబాటు చేస్తాడో యోధుడు. అతనే వీరమల్లు. క్లైమాక్స్ కోసం పవన్ కళ్యాణ్ తనకొచ్చిన మార్షల్ ఆర్ట్స్, డిఫెన్స్ కళలు అన్నీ వాడేశారు. 57 రోజుల పాటు మండుటెండలో షూట్ చేయడం తెరమీద గొప్ప అనుభూతి ఇవ్వనుంది. ఇరవై నిమిషాల పాటు ఈ ఎపిసోడ్ ఉంటుంది.

చూస్తుంటే అనుకున్న దానికన్నా చాలా గొప్ప స్థాయిలో హరిహర వీరమల్లు ఉండబోతోందనే నమ్మకం క్రమంగా ఫ్యాన్స్ లో పెరుగుతోంది. స్పెషల్ ప్రీమియర్ల ద్వారా పెద్ద రిస్క్ కు సిద్ధపడ్డ నిర్మాత ఏఎం రత్నం తన కాన్ఫిడెన్స్ ని అలాగే చూపిస్తున్నారు. 2025 బెస్ట్ మూవీ అవుతుందనే ధీమా కనిపిస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఇప్పుడీ హిట్టు చాలా అవసరం. ఎందుకంటే టయర్ 1 హీరో సినిమా వచ్చి ఆరు నెలలు అయిపోయాయి. వందల కోట్లు వసూలు చేసి వారాల తరబడి హౌస్ ఫుల్ చేసిన సినిమాలు పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత లేవు. ఇప్పుడీ లిస్టులోకి హరిహర వీరమల్లు చేరుతుందా లేదానేది వేచి చూడాలి.