శంకర్ కలను తీర్చే నిర్మాత ఎవరు

ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ ఇలా రెండు అల్ట్రా డిజాస్టర్లతో దర్శకుడు శంకర్ ఇచ్చిన షాక్ నుంచి కమల్ హాసన్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. బయ్యర్లకు పీడకలలా మిగిలిపోయిన ఈ సినిమాల గురించి సోషల్ మీడియాలో నెలల తరబడి డిస్కషన్లు, ట్రోలింగ్స్ జరిగాయి. మొన్న తమ్ముడు ప్రమోషన్లలోనూ దీని గురించి జరిగిన రాద్ధాంతం దిల్ రాజుని ఇబ్బంది పెట్టింది. ఇదిలా ఉండగా శంకర్ ఎప్పటి నుంచో చెబుతున్న డ్రీం ప్రాజెక్టు వేల్పరి. మూడు భాగాలుగా వందల కోట్ల బడ్జెట్ డిమాండ్ చేసే ఈ విజువల్ గ్రాండియర్ ని తెరకెక్కించాలని ఆయన ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. స్క్రిప్ట్ కూడా రాసుకున్నారు.

నిన్న జరిగిన వేల్పరి లక్ష కాపీ అమ్మకాల ఈవెంట్ లో మాట్లాడుతూ మరోసారి తన ఆకాంక్షను బయట పెట్టారు. ఇది తీరాలని సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అదే వేదిక మీద చెప్పారు. వినడానికి బాగానే ఉంది కానీ శంకర్ ని నమ్మే నిర్మాతలు ఎవరనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆల్రెడీ రెండుసార్లు దెబ్బ తిన్న లైకా ప్రొడక్షన్స్ ఈసారి రిస్క్ చేసేందుకు రెడీగా లేదు. సన్ పిక్చర్స్ రోబో సీక్వెల్ కే సాహసించలేదు. టాలీవుడ్ లో మైత్రి లాంటి సంస్థలు ఉన్నాయి కానీ శంకర్ మీద అంత పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా లేరు. పోనీ శంకర్ స్వంతంగా తీసుకోవచ్చు కదా అంటే సంపాదించినదంతా పెట్టినా సరిపోదేమో.

శంకర్ తో సమస్య హిట్టు ఫ్లాపు కాదు. ముందు చెప్పిన బడ్జెట్ కి పొంతన లేకుండా తర్వాత ఖర్చుని విపరీతంగా పెంచేస్తారు. స్క్రీన్ మీద ఆ క్వాలిటీ కనిపించినా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. గేమ్ ఛేంజర్ లో నానా హైరానా పాట కన్నా ఉదాహరణ అక్కర్లేదు. దీనికి తోడు ఏళ్లకు తరబడి నిర్మాణం చేయడం ఇంకో మైనస్. రామ్ చరణ్ లాంటి హీరోని మూడేళ్లు బ్లాక్ చేయడం తనకు కెరీర్ పరంగా చాలా నష్టం చేసింది. పొన్నియిన్ సెల్వన్ తరహాలో సాగే వేల్పరికి ఎంతలేదన్నా వెయ్యి కోట్లకు పైగా అవసరమవుతుందట. మరి శంకర్ స్వప్నం తీర్చడానికి ఎవరైనా ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారేమో వేచి చూడాలి.