ప్రేక్షకులు సిద్ధం… సినిమాలే ఆలస్యం

రెండు వారాల ముందు వరుకు తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లు కనీసం అద్దెలు కూడా వసూలు కానంత దీన స్థితిని చూస్తూ, షోలు క్యాన్సిల్ చేయడం కోసం గేట్లు తీసే పరిస్థితిలో ఉండేవి. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, తండేల్, మ్యాడ్ స్క్వేర్, సింగిల్, హిట్ 3 లాంటి కొన్ని సినిమాలు తప్ప మిగిలినవి కనీస స్థాయిలో ఆడలేక చేతులు ఎత్తేశాయి. కట్ చేస్తే జూన్ లో మంచి శుభారంభం దక్కుతోంది. వరసగా రెండు వారాలు కొత్త రిలీజులు జనాన్ని టికెట్లు కొనేలా చేస్తున్నాయి. జూన్ 20 కుబేర ఆల్రెడీ వంద కోట్లతో బోణీ చేయగా తాజాగా కన్నప్ప మంచి టాక్ తో మంచు విష్ణు కెరీర్ బెస్టయ్యే దిశగా పరుగులు పెడుతోంది.

ఆశ్చర్యకరంగా హాలీవుడ్ మూవీ ఎఫ్1కు సైతం మంచి ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏ సెంటర్స్ లో ఈ కార్ రేసింగ్ మూవీ ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ భారీగా కనిపిస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిన సినిమాగా గట్టి ప్రశంసలు అందుకుంటోంది. అసలు చప్పుడు లేకుండా వచ్చిన విజయ్ ఆంటోనీ మార్గన్ స్లోగా పికప్ అవుతోంది. డీసెంట్ థ్రిల్లరనే టాక్ క్రమంగా వసూళ్లు తెస్తోంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐపిఎల్ మ్యాచులు, వర్షాలు, పిల్లల స్కూళ్ళు, పరీక్షలు వగైరా కేవలం సాకులు మాత్రమే. మన కంటెంట్ లో లోపాలను కప్పిపుచ్చుకోవడానికి వీటి మీదకు తోసేస్తున్నాం.

ఇప్పుడు ఇంత స్పష్టంగా జనం థియేటర్లకు రావడం బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రేక్షకులు ఎప్పడూ సిద్ధంగానే ఉంటారు. కాకపోతే సరైన సినిమాలు రావాలంతే. ఇప్పటికే బంగారం లాంటి వేసవి సీజన్ వృథా అయిపోయింది. ఒకవేళ హరిహర వీరమల్లు, కింగ్ డమ్, విశ్వంభర లాంటివి సమ్మర్ లో వచ్చి ఉంటే పరిశ్రమకు భారీ ఎత్తున రెవిన్యూ సమకూరేది. కానీ ప్లానింగ్ లోపాల వల్ల మిస్ అయిపోయింది. ఈ జోష్ ని వచ్చే వారం నితిన్ తమ్ముడు కొనసాగించాలి. నిర్మాత దిల్ రాజు కాన్ఫిడెన్స్ అయితే అదే స్పష్టం చేస్తోంది. ఏదైతేనేం పబ్లిక్ తో థియేటర్లు కళకళలాడుతున్నాయి. దీనికన్నా ఇండస్ట్రీ కోరుకునేది ఏముంటుంది.