కుబేరలో ధనుష్, నాగార్జునలకు ఎంత ప్రాధాన్యం ఉన్నా వాళ్లతో సమానంగా ట్రావెల్ చేసి కీలక మలుపులకు కారణమైన పాత్రలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నిజానికి శేఖర్ కమ్ముల కథల్లో విలన్లు ఉండరు. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా ఇలా దేంట్లోనూ ప్రతినాయకుడు కాదు కదా వాళ్ళ ఛాయలు కూడా కనిపించవు. అనామిక రీమేక్ కాబట్టి అందులో మాత్రమే ఒక విలన్ ఉంటాడు. కానీ కుబేరకు వచ్చేటప్పటికి లక్షల కోట్ల వ్యాపారం చేస్తూ ఒళ్ళంతా పొగరు నిండిన నీరజ్ మిశ్రా క్యారెక్టర్ కు బలమైన స్టేజి ఆర్టిస్టు కావాలి. వంద శాతం పండించే టాలెంట్ ఉండాలి.
దానికి జిమ్ సర్భ్ వంద శాతం న్యాయం చేకూర్చాడు. ఇతనేమి సీనియర్ మోస్ట్ నటుడు కాదు. 2014 షురురత్ కి ఇంటర్వెల్ అనే ఫ్లాప్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. 2016 నీర్జాలో చేసిన పాత్ర అతని ప్రతిభను బయటికి తెచ్చింది. 2018 రెండు వరస బ్లాక్ బస్టర్లు పద్మావత్, సంజుతో లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఆ తర్వాత కెరీర్ పరుగులు పెట్టలేదు కానీ చెప్పుకోదగ్గ అవకాశాలు వచ్చాయి. మేడ్ ఇన్ హెవెన్, రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్ లు కామన్ ఆడియన్స్ ని దగ్గర చేశాయి. తండ్రి వృత్తి రీత్యా చిన్నప్పుడే విదేశాలు తిరిగిన జిమ్ సర్భ్ అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ సైకాలజీ డిగ్రీ పొందటం గమనార్హం.
కుబేరలో జుత్తుకి తెల్లరంగు వేశారు కానీ ఇతని వయసు 37 సంవత్సరాలే. ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది. తెలుగు రాకపోయినా సరే డైలాగులను బట్టిపట్టి డబ్బింగ్ ఆర్టిస్టుకి సింక్ సమస్య రాకుండా చూపించిన నటన ఇప్పుడు ప్రశంసలు దక్కించుకుంటుంటోంది. ఒకవేళ ఇదే నీరజ్ మిశ్రాగా ఏ ప్రకాష్ రాజో రావు రమేషో అయ్యుంటే చాలా రొటీన్ ఫీలింగ్ కలిగేది. అందుకే శేఖర్ కమ్ముల వెతికి మరీ ఈ జిమ్ సర్భ్ ని తీసుకొచ్చాడు. పేరైతే వచ్చింది కానీ ఎలాంటి అవకాశాలు దక్కబోతున్నాయో చూడాలి. అన్నట్టు తొలి సినిమాతోనే ఏడు అవార్డులు సాధించిన ఈ విలక్షణ నటుడి కెరీర్ ఇకనైనా వేగం పుంజుకుంటుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates