మలయాళ దర్శకుడికి బన్నీ పచ్చజెండా ?

పుష్ప 2 దెబ్బకు ప్యాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ సాధించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ సినిమాతో ఏకంగా ఇంటర్నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేసుకున్నాడు. హాలీవుడ్ స్టాండర్డ్స్ ని చేరుకునేందుకు అధిక శాతం విదేశీ నిపుణులతో రూపొందే ఈ ఫాంటసీ మూవీ షూటింగ్ ఇటీవలే ముంబైలో మొదలయ్యింది. హీరోయిన్ గా దీపికా పదుకునేని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు కానీ ఇందులో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఉన్నారనేది ముంబై లీక్స్ నుంచి తెలుస్తోంది. ఇదిలా ఉండగా కారణాలు ఏవైనా త్రివిక్రమ్ సినిమాను వదిలేసుకున్న బన్నీ లిస్టులో ఇప్పుడో మలయాళం డైరెక్టర్ చేరాడట.

గత కొన్ని నెలలుగా అల్లు అర్జున్ ని కలుస్తున్న అతను స్టోరీని దాదాపు ఓకే చేయించుకున్నాడని, ఫైనల్ వెర్షన్ లాక్ కాగానే అనౌన్స్ మెంట్ ఇవ్వాలని చూస్తున్నారట. విశ్వసనీయ సమాచారం మేరకు బాసిల్ జోసెఫ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇతను ఇప్పటిదాకా మలయాళంలో డైరెక్ట్ చేసినవి మూడు సినిమాలు. అన్ని బాగానే ఆడాయి కానీ 2021లో వచ్చిన మిన్నల్ మురళి ఓటిటిలో రిలీజైనా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి బాసిల్ జోసెఫ్ పేరు పైకి తీసుకెళ్ళింది. ఇది కరోనా టైంలో జరిగింది. ఆ తర్వాత బాసిల్ జోసెఫ్ మళ్ళీ మెగా ఫోన్ చేపట్టలేదు. హీరోగా వరస హిట్లు పడటంతో నాలుగేళ్లు డైరెక్షన్ కు దూరంగా ఉన్నాడు.

ఈ గ్యాప్ లో ఒక అద్భుతమైన సబ్జెక్టు సిద్ధం చేసుకున్నాడని, అది అల్లు అర్జున్ కి వినిపిస్తే నచ్చిందని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. ఇది ఎంతవరకు నిజమనేది ఇంకో రెండు మూడు నెలలు ఆగితే తెలిసి రావొచ్చు. బాసిల్ జోసెఫ్ కాకుండా మరో ఇద్దరు కేరళ డైరెక్టర్లు తమ ప్రయత్నాల్లో ఉన్నారట. ఫైనల్ గా బన్నీ ఎవరికి ఓకే చెబుతాడనేది వేచి చూడాలి. పుష్ప నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్న అల్లు అర్జున్ నిజంగా బాసిల్ జోసెఫ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది పెద్ద షాకవుతుంది. తన జడ్జ్ మెంట్, నిర్ణయాల్లో చాలా ఏళ్లుగా తప్పటడుగు వేయని బన్నీ ఈసారి కూడా సరైన దిశలో వెళ్తాడని ఫ్యాన్స్ నమ్మకం. చూద్దాం.