అయిదేళ్ళు నిర్మాణం జరుపుకున్న హరిహర వీరమల్లు మీద ఆశించిన స్థాయిలో బజ్ ఇంకా పెరగలేదనే కామెంట్ లో నిజమున్నప్పటికీ సానుకూల కోణంలో చూస్తే ఈ ప్యాన్ ఇండియా మూవీకున్న అవకాశాలేంటో కనిపిస్తాయి. ముఖ్యంగా దర్శకులు క్రిష్-జ్యోతి కృష్ణ తీసుకున్న నేపథ్యం వర్తమానంది కాదు. శతాబ్దాల వెనుకటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కాబట్టి దానికి ఎక్స్ పైరి డేట్ లాంటివి ఉండవు. కాలంతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే అందరికీ కనెక్టవుతాయి. పద్మావత్, జోధా అక్బర్, బాజీరావు మస్తానీ లాంటి వాటిని ఉదాహరణగా తీసుకోవచ్చు. సినిమా బాగుందనే మాట వస్తే క్లాసు మాస్ అందరూ థియేటర్లకు వస్తారు.
సో జాప్యం వల్ల ప్రభావం పడే ఛాన్స్ తక్కువే. కాకపోతే ప్రమోషన్ల పరంగా మెగా సూర్య ప్రొడక్షన్స్ దూకుడు పెంచాల్సిన అవసరం చాలా ఉంది. సమయం ఒత్తిడి వల్ల నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు కానీ పబ్లిసిటీ బాధ్యతలను వేరొకరికైనా అప్పగించి ఇంకాస్త ఫోకస్ పెట్టాలి. చరిత్ర తిరగేసి చూస్తే లవకుశ, అమ్మోరు, అరుంధతి లాంటి సినిమాలు అయిదారేళ్ళు నిర్మాణం జరుపుకున్నా ఘనవిజయం సాధించాయి. అలాంటి అడ్వాంటేజ్ వీరమల్లుకు దక్కాలనేది ఫ్యాన్స్ కోరిక. జూన్ 12 వచ్చే దాకా ఇలాంటి అంచనాలు, సమీకరణాలు జరుగుతూనే ఉంటాయి.
ఇక్కడో విషయం మర్చిపోకూడదు. సబ్జెక్టు మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప హరిహర వీరమల్లుని రెండు భాగాలుగా తీసే సాహసం చేయరు. సెకండ్ పార్ట్ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా మొదటి భాగం బ్లాక్ బస్టరవుతుందనే కాన్ఫిడెన్స్ తోనే ఇంత పెద్ద కాన్వాస్ కి సీక్వెల్ ముందే ప్లాన్ చేసుకున్నారు. బాహుబలి, కెజిఎఫ్, పుష్ప తరహాలో దీనికీ మేజిక్ రిపీటవుతుందనే అభిమానుల నమ్మకం. రాబోయే పదిహేను రోజులు హరిహర వీరమల్లుకి కీలకం కాబోతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న పవన్ మూవీ కాబట్టి ఓపెనింగ్స్ తోనే రికార్డులు మొదలవుతాయి. వాటిని నిలబెట్టుకోవాల్సింది మాత్రం టాకే.