గత రెండు వారాలుగా టాలీవుడ్ ని ఊపేస్తున్న థియేటర్ల బంద్ ప్రచారం, హరిహర వీరమల్లు వివాదం, ఆ నలుగురు మధ్య నలుగుతున్న వ్యవహారం గురించి నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టడం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. దాని గురించి ఎలా స్పందించాలో అర్థం కాక కొందరుంటే, మరింత స్పష్టత ఇవ్వకపోతే నష్టం పెరిగే అవకాశం ఉందని గుర్తించిన దిల్ రాజు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. సుదీర్ఘంగా కూలంకుషంగా ముందు నుంచి జరుగుతున్న విషయాలు, అసలు నిజాలు పక్కదారి పట్టిన వైనాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని ఆలోచింపజేసే విధంగా ఉండగా మరి కొన్ని పూర్తి స్పష్టత ఇవ్వలేదు..
దిల్ రాజు చెప్పిన దాని ప్రకారం ఎగ్జిబిటర్లు అడిగిన పెర్సెంటేజ్ డిమాండ్ ఏదైతే ఉందో దాని గురించి సరైన రీతిలో ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి కమ్యూనికేషన్ జరగలేదు. దీంతో జూన్ 1 నుంచి సినిమా హాళ్లు మూతబడతాయనే ప్రచారానికి రెక్కలు వచ్చాయి. ఏప్రిల్, మే నెలల్లో జరిగిన పలు సమావేశాల్లో మాట్లాడుకున్న అంతర్గత విషయాలు ప్రైవేట్ మార్గాల్లో బయటికి వచ్చి అర్థాన్ని మార్చేశాయి తప్పించి అసలు హరిహర వీరమల్లుని ఆపే ఉద్దేశం, దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని మరోసారి కుండబద్దలు కొట్టేశారు. నిన్న అరవింద్ ఇచ్చిన స్టేట్మెంట్ ని మరోసారి బలపరుస్తూ మాట్లాడారు.
పక్క రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో పర్సెంటెజ్ సిస్టమే అమలవుతోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు అద్దె విధానం పట్ల సానుకూలంగానే ఉన్నారు. కాకపోతే పెద్ద సినిమాలకు మొదటి వారం అద్దెలు ఇచ్చి రెండో వారం నుంచి పర్సెంటెజ్ ఇవ్వడమనే పద్ధతిని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అలా కాకుండా అన్ని వారాలకు రెంట్ ఇస్తే తమకు స్థిరమైన ఆదాయం ఉంటుందనేది ఎగ్జిబిటర్ల వర్షన్. ఇది తీరాలి అంటే ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ జాయింట్ మీటింగ్ లో కూర్చుని మాట్లాడుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది. కాకపోతే ఎవరి స్వార్థం వారిదన్న తరహాలో వ్యవహరించే తీరు వల్లే మ్యాటర్ ఇక్కడి దాకా వచ్చింది.
ఇదంతా దిల్ రాజు చెప్పిన దాంట్లో ప్రధాన సారాంశం. అద్దెలు ఇచ్చే విషయంలో నిర్మాతల నిర్ణయాలు ఆధిపత్యం వహిస్తున్నాయని ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్న ఆయన మరి కొన్ని అంశాలకు సంబంధించి మాత్రం వాటికి ఇతర ప్రొడ్యూసర్లను అడగండి అంటూ దాటవేశారు. తానిప్పుడు ఏఐ, కొత్త ప్రతిభను ప్రోత్సహించే డ్రీమ్స్ అంటూ కొత్త ఆలోచనలు చేస్తున్నానని కాబట్టి మళ్ళీ కిందకు వెళ్ళలేనని తేల్చేశారు. నైజామ్ లో 370 సింగల్ స్క్రీన్లు ఉంటే వాటిలో కేవలం 30 మాత్రమే తనవని.. సురేష్ ఏషియన్ కు మరో 90 ఉంటాయని, మిగిలిన 250 తమ కంట్రోల్ లో లేవని చెప్పేశారు.
దీన్ని బట్టి ఇక్కడితో పిక్చర్ మొత్తం అర్థమైనట్టు కాదు. బోలెడు పజిల్ మిగిలిపోయే ఉంది. ఎగ్జిబిటర్లు అద్దెలకు అనుకూలంగా ఉన్నారని చెబుతున్న దిల్ రాజు మరి బంద్ లాంటి తీవ్రమైన డిమాండ్ ఎందుకు వచ్చిందో చెప్పలేకపోయారు. పైగా మీడియా సృష్టి అంటూ స్మార్ట్ గా అన్నారు కానీ నిజానికి ఎగ్జిబిటర్ల లేఖ బయటికి వచ్చి స్పందించి ఉంటే పరిణామాలు వేరేలా ఉండేవేమో అనే పాయింట్ ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తోంది. సో ఇంకా స్టోరీ అయిపోలేదు కాబట్టి టాలీవుడ్ నుంచి ఇంకా ఎవరెవరు పెద్దలు వస్తారో ఏమేం పంచుకుంటారో చూడాలి. నెక్స్ట్ సురేష్ బాబు ప్రెస్ మీట్ ఉండొచ్చని ఇండస్ట్రీ టాక్.