కొత్త సినిమా… ఆ ఒక్క ఊరిలోనే రిలీజ్

ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో రష్ చూడబోతున్నాం. ‘కొరియన్ కనకరాజు’ లాంటి క్రేజీ మూవీ థియేటర్లలోకి దిగుతోంది. దీంతో పాటు దివంగత దర్శకుడు కేకే (కిరణ్) రూపొందించిన ‘కేజేక్యూ’తో పాటు తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన తమిళ అనువాద చిత్రం ‘డీసీ’ కూడా ఈ వీకెండ్లోనే థియేటర్లలోకి రానుంది. వీటితో పాటు ఇంకో తెలుగు చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కావాల్సింది. ఆ చిత్రమే.. అనకాపల్లి. 

సీనియర్ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రంలో తారక్ పొన్నప్ప విలన్ పాత్ర చేశాడు. ‘చిదంబరం’ సినిమా ఫేమ్ సంధ్య వశిష్ఠ ఇందులో హీయిన్‌గా నటించింది. ఐతే శుక్రవారం రిలీజ్ అని అంతా అనుకుంటుండగా.. ముందు రోజు టీం ఆశ్చర్యకర ప్రకటన చేసింది. ఈ సినిమా వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. అలా అని ఈ మూవీ రిలీజ్ పూర్తిగా ఏమీ ఆగిపోలేదు. ఒక టౌన్లో మాత్రం రిలీజ్ కాబోతోంది.

తమ సినిమాకు ‘అనకాపల్లి’ అనే టైటిల్‌ పెట్టుకున్న టీం.. అనకాపల్లిలోనే రేపు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోంది. అనకాపల్లి ప్రజలకు ట్రిబ్యూట్‌గా తమ చిత్రాన్ని ముందుగా అక్కడ రిలీజ్ చేసి స్థానిక ప్రజలకు చూపించి, వారి అభిప్రాయం తీసుకోవాలనుకుంటున్నట్లు టీం తెలిపింది. ముందుగా అనకాపల్లి వాసులు చూశాకే మిగతా ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీం తెలిపింది. 

కానీ బజ్ లేని సినిమాను ప్రేక్షకుల దృష్టిలో పడేసేందుకు ఇలా పబ్లిసిటీ ఎత్తుగడ వేశారా అనిపిస్తోంది. ఈ వారం బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉండడం.. తమ సినిమా గురించి జనాలకు పెద్దగా తెలియకపోవడం.. చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లు కూడా దక్కేలా లేకపోవడంతోనే టీం రిలీజ్ వాయిదా వేసినట్లు కనిపిస్తోంది. కాకపోతే అనకాపల్లిలో రిలీజ్ అని ప్రకటించడం ద్వారా జనం దృష్టిలో సినిమా పడేలా చేయాలనుకుంటున్నారు. మరి అక్కడి నుంచి ఎలాంటి టాక్ వస్తుందో.. సినిమా రెగ్యులర్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.