సందీప్ వంగా మాస్టర్ స్ట్రోక్ అదిరిపోయింది

స్పిరిట్ నుంచి దీపికా పదుకునేని తప్పించడం గురించి బాలీవుడ్ మీడియాలో పెను దుమారమే రేగింది. ఒక సౌత్ దర్శకుడు అంత పెద్ద స్టార్ హీరోయిన్ ని వద్దనుకోవడం పట్ల తెగ ఉడుక్కుని సింపతీ కార్డులు ప్లే చేశారు. బిడ్డ తల్లయిన దీపికా కండీషన్లు పెట్టడంలో తప్పేంటంటూ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ పసిగుడ్డు జాగ్రత్తలు చూసుకోవడమే ముఖ్యమైనప్పుడు అల్లు అర్జున్ సినిమా కూడా వదులుకోవాలిగా. అలియా భట్ లాంటి వాళ్ళు ఈ ఇబ్బందిని అధిగమించి తమ కెరీర్లు చక్కగా ప్లాన్ చేసుకోవడం వల్ల చేతిలో మూడు నాలుగు ప్యాన్ ఇండియా మూవీస్ చేసేంత బిజీగా ఉన్నారు.

ఇదంతా కాదని సందీప్ రెడ్డి వంగా త్రిప్తి డిమ్రిని ఎంచుకోవడం ద్వారా నార్త్ జనాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు. దీపికాకు ఇచ్చే పారితోషికంలో మహా అయితే ఓ పాతిక శాతం లోపే త్రిప్తి తీసుకుంటుంది. అంటే బడ్జెట్ లెక్కల్లో పెద్ద మొత్తాన్ని సందీప్ వంగా మిగుల్చుకున్నాడు. పైగా స్పిరిట్ పూర్తిగా హీరో బేస్డ్ కంటెంట్. ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ కథను అత్యంత హింసాత్మక రీతిలో, ఎప్పుడూ చూడని విధంగా సందీప్ వంగా డిజైన్ చేసుకున్నాడు. అలాంటప్పుడు హీరోయిన్ కి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఉండకపోవచ్చు. నాలుగైదు బలమైన సీన్లు ఉంటాయి. వాటిని పండించడానికి త్రిప్తి డిమ్రి కష్టపడితే చాలు.

ఒకవేళ దీపికా బదులు కియారా అద్వానీ లేదా రష్మిక మందన్నను తీసుకుని ఉంటే ఈ డిస్కషన్ అవసరం లేదు. ఎందుకంటే దీపికాకు సరిజోళ్ళు కాబట్టి ఓకే అనుకునేవారు. కానీ త్రిప్తి డిమ్రిని లాక్ చేయడం ద్వారా సందీప్ వంగా ఒక బలమైన సందేశం ఇచ్చాడు. కెరీర్ మొత్తంలో తానిచ్సిన యానిమల్ తప్ప మరో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లేని అమ్మాయిని ప్రభాస్ పక్కన పెట్టి హిట్టు కొట్టి చూపిస్తానని డైరెక్ట్ గా చెప్పాడు. అయినా ప్రభాస్ లాంటి కటవుట్ పక్కన ఏ హీరోయిన్ ఉన్నా కంటికి ఆనదు. దృష్టి మొత్తం డార్లింగ్ మీదే ఉంటుంది. ఇది తెలిశాక సందీప్ రెడ్డి వేసింది మాస్టర్ ప్లాన్ కాదని అనగలమా. .