ఎదురుచూసి చూసి అలిసిపోయిన నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పేలా లేదు. గత ఏడాది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాక ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కాంబో వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావించారు కానీ జరగలేదు. ఇప్పుడింకో ఏడు నెలలు వెయిటింగ్ చేయక తప్పదని లేటెస్ట్ అప్డేట్. ప్రస్తుతం శిక్షణ మొత్తం పూర్తి చేసుకున్న మోక్షజ్ఞ ఫిజికల్ ఫిట్ నెస్ కోసం మరికొంత సమయం తీసుకోబోతున్నాడట. ఈలోగా దర్శకుడు, బ్యానర్, కథకు సంబంధించి బాలకృష్ణ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెబుతున్నారు.
గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ప్రజానాయకుడు తీసిన దర్శకుడు క్రిష్ చేతికి మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతని ఇవ్వబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఆదిత్య 369 సీక్వెల్ గా బాలయ్య సిద్ధం చేసుకున్న ఆదిత్య 999 స్టోరీ ద్వారా ఈ లాంచ్ జరగాలని కోరుకుంటున్నారట. నిజానికిది స్వీయ దర్శకత్వంలో తీయాలనేది బాలకృష్ణ ముందు అనుకున్న ప్లానింగ్. కానీ వరస హిట్లతో కెరీర్ దూసుకుపోతున్న టైంలో డైరెక్షన్ ని నెత్తి మీద వేసుకుంటే ఒత్తిడి పెరిగి లేనిపోని చిక్కులు వస్తాయని భావించి ఆ మేరకు క్రిష్ తో సంప్రదింపులు జరిగి దాదాపు లాక్ చేసే దిశగా నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. డిసెంబర్ నుంచి మొదలవ్వొచ్చు.
ఇది నిజమైతే బాలయ్య అభిమానులకు గుడ్ న్యూసే. ఆదిత్య 369 కొనసాగింపు కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే రీ రిలీజ్ చేసినప్పుడు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడా దిశగానే ప్రణాళిక సిద్ధం కావడం విశేషం. ఆదిత్య 999లో మోక్షజ్ఞతో పాటు బాలయ్య కూడా ఉంటారట. తండ్రి కొడుకుల కాంబో అంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఇప్పటికే లేట్ చేసిన మోక్షజ్ఞ వచ్చి రాగానే సినిమాలు వేగంగా చేయడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఏడాదికి ఒకటి లేదా రెండేళ్లకు ఒకటి తరహాలో కాకుండా నాన్న వేగాన్ని అందిపుచ్చుకుని ఎక్కువ సినిమాల్లో నటించడం ముఖ్యం.
Gulte Telugu Telugu Political and Movie News Updates