నిన్న సింధు.. నేడు కాజల్

నిన్న బ్యాడ్మింటన్ స్టార్ ‘ఐ రిటైర్’ అంటూ పెట్టిన ట్వీట్ ఎంతగా కలకలం రేపిందో తెలిసిందే. ముందు ఆమె ట్విట్టర్ పోస్టును సరిగా అర్థం చేసుకోలేక అందరూ సింధు రిటైరైపోయిందంటూ గగ్గోలు పెట్టారు. ఇంత త్వరగా రిటైర్మెంట్ ఏంటి అంటూ ఆమెకు ప్రశ్నలు సంధించారు. కానీ ఆమె పోస్టును జాగ్రత్తగా, చివరిదాకా చదివితే కానీ అసలు విషయం బోధ పడలేదు.

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో భయం, అనిశ్చితి నుంచి తాను రిటైరవ్వాలనుకుంటున్నట్లు, మళ్లీ ఆటలోకి జనవరిలో పునరాగమనం చేయబోతున్నట్లు సింధు చెప్పింది. ఈ నిగూడార్థం తెలిశాక అందరూ సింధును రివర్సులో తిట్టారు. ఈ విషయాన్ని ఈ రకంగా చెప్పాలా.. సరళంగా సందేశాన్నివ్వొచ్చు కదా అన్నారు. ఐతే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం సెలబ్రెటీలందరూ కలిసి చేస్తున్న ప్రయత్నం లాగా అనిపిస్తోంది.

ఎందుకంటే సింధు ఇలా పోస్టు పెట్టిన 24 గంటల్లోనే దాదాపు అలాంటి పోస్టే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా పెట్టింది. ఆమె ‘ఇట్స్ నెవర్ టూ లేట్.. ఐ సే నో’ అని ఆమె సింధు లాగే ఒక పేజీలో బోల్డ్ అక్షరాలతో మెసేజ్ పెట్టింది. తర్వాతి రెండు పేజీల్లో దీని అర్థమేంటో వివరించింది. కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశమే లేదని, తర్వాత బాధ పడటం కంటే ఇప్పుడు కొన్ని విషయాలకు ‘నో’ చెప్పాల్సిన అవసరం ఉందని.. ప్రస్తుత పరిస్థుతులకు తాను ‘నో’ చెబుతున్నానని.. భయం, అనిశ్చితి లాంటి వాటికి ‘నో’ చెబుతున్నానని కాజల్ వివరించింది. వైరస్‌ను ఎదుర్కోవడంలో పరిశుభ్రత ప్రాధాన్యతను వివరిస్తూ, మనం బయటికి వెళ్లేటపుడు జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని కాజల్ ఇచ్చింది.

వైరస్‌కు దీటైన బదులివ్వడానికి అందరం కలిసి కట్టుగా ప్రయత్నం చేయాలని ఆమె అంది. ఇప్పుడు మన ఎంపికలు భవిష్యత్తును నిర్దేశిస్తాయని చెప్పిన కాజల్.. తాను జీవితంలో కొత్త దశలోకి వెళ్తున్న నేపథ్యంలో పాత తరహా జీవన విధానాన్ని విడిచిపెట్టి సురక్షిత వాతావరణంలో జీవితాన్ని సాగించే దిశగా అడుగులేస్తానని ఆమె స్పష్టం చేసింది. మున్ముందు ఇదే తరహాలో సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా పోస్టులు పెట్టబోతున్నారని అర్థమవుతోంది.