మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు: చిరంజీవి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదం లో గాయపడిన సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ కు ప్రమాదం జరగడంతోనే మెగాస్టార్ చిరు దంపతులు పవన్ తో కలిసి సింగపూర్ వెళ్లారు. తాజాగా గురువారం సాయంత్రం చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర సందేశాన్ని పోస్ట్ చేశారు  ఈ పోస్టుకు తన సోదరుడు పవన్ తో కలిసి కనిపిస్తున్న తన ఫొటోను ఆయన జత చేశారు.

మార్క్ శంకర్ గురువారం సాయంత్రానికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఈ సందర్భంగా ఇదే విషయాన్ని తెలియ జేస్తూ చిరంజీవి ఈ పోస్టును చేశారు. “మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు” అంటూ సదరు పోస్టును మొదలుపెట్టిన చిరంజీవి… మార్క్ శంకర్ బాగానే ఉన్నాడని తెలిపారు. అయితే శంకర్ ఇంకా కోలుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. శంకర్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్లీ మామూలుగా ఎప్పటిలాగే ఉంటాడని ఆయన తెలిపారు. శుక్రవారం హనుమత్ జయంతి అని పేర్కొన్న చిరంజీవి… ఆ స్వామే ఓ పెద్ద ప్రమాదం నుంచి ఓ విషాదం నుంచి తన బిడ్డను కాపాడి తమకు అందించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇక మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన చిరంజీవి… మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి అండగా నిలబడ్డారని, తమ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారని, ఆశీస్సులు అందిస్తున్నారని పేర్కొన్నారు. తమ బిడ్డ క్షేమం కోరుకున్న వారందరికీ తన తరఫున, తన తమ్ముడు పవన్ కల్యాణ్ తరఫున… మొత్తంగా తమ కుటుంబం అందరి తరఫున అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. మొత్తంగా మార్క్ శంకర్ కు చాలా త్వరగానే ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన వైనం తమ కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందన్న విషయాన్ని చిరంజీవి తన పోస్టులో చెప్పుకొచ్చారు.