షాకింగ్ : కాంతార హీరోకు పంజుర్లి హెచ్చరిక

పెద్దగా అంచనాలు లేకుండా కేవలం పదహారు కోట్లతో రూపొంది మూడు వందల కోట్లకు పైగా సాధించిన బ్లాక్ బస్టర్ గా కాంతార గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటిదాకా శాండల్ వుడ్ తప్ప బయట ప్రపంచానికి అంతగా పరిచయం లేని హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి పేరు ప్యాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగిపోయింది. దాంతో కాంతర సీక్వెల్ ని చాఫ్టర్ 1 పేరుతో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. పంజుర్లి గ్రామ దేవత నేపథ్యంలో రూపొందిన ఈ డివోషనల్ డ్రామాలో చూపించిన ఘట్టాలు రిషబ్ స్వంత ఊరితో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో అతనికో షాక్ తగిలింది.

ఇటీవలే రిషబ్ శెట్టి మంగళూరులోని పంజుర్లి దేవస్థానాన్ని సందర్శించాడు. ప్రతి సంవత్సరం ప్రత్యేక దినాన ఉదయం పదకొండు నుంచి మరుసటి రోజు తెల్లవారుఝాము నాలుగు గంటల దాకా జరిగే వేడుకలో భాగం పంచుకున్నాడు. ఇది కద్రి బరిబైల్ అనే ప్రాంతంలో జరుగుతుంది. పండగ చివరిలో రిషబ్ తో పంజుర్లి పూనిన పూజారి మాట్లాడుతూ నీ చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారని, భారీ కుట్రకు తెర తీశారని, నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా కాపాడతాడని రక్షణ హామీ ఇచ్చాడు. వారాహి పంజుర్లి నోటి వెంట వచ్చిన ఈ వాక్కులు విని అక్కడున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు.

నిజానికి రిషబ్ కాంతార పార్ట్ 1 తీస్తున్న క్రమంలో చాలా సమస్యలు ఎదురుకున్నాడు. బెంగళూరు దగ్గర్లోని షూటింగ్ ప్రాంతంలో పర్యావరణానికి హానీ కలిగిస్తున్నారని స్వయంగా అటవీ శాఖా మంత్రి చర్యలకు పూనుకోవడం సంచలనం రేపింది. చిత్రీకరణ సమయంలో ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు వాడారని ప్రభుత్వానికి కంప్లయింట్స్ వచ్చాయి. ఒక వాహన ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇవన్నీ టీమ్ కి తలనెప్పిగా మారాయి. అక్టోబర్ 2 విడుదల ప్లాన్ చేసుకున్న కాంతార చాప్టర్ 1 అనుకున్న సమయానికి విడుదల చేయాలనే లక్ష్యంతో రిషబ్ శెట్టి చాలా కష్టపడుతున్నాడు.