వీరమల్లు సందేహాలు తీరినట్టే

పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజి జపం ఎక్కువ చేస్తున్నా ముందుగా వచ్చేది హరిహర వీరమల్లునే. మే 9 విడుదల తేదీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఖచ్చితంగా మాట మీద ఉంటుందా లేదానే అనుమానాలు జనంలో లేకపోలేదు. ఇప్పటిదాకా వచ్చిన టీజర్లు, పాటలు బాగానే ఉన్నప్పటికీ ప్యాన్ ఇండియా మూవీకి కావాల్సిన ఎగ్జైట్ మెంట్ ని ఇంకా పూర్తి స్థాయిలో సృష్టించలేకపోయాయి. చూస్తేనేమో చేతిలో పట్టుమని నలభై రోజులు కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో నిజంగా వీరమల్లు అనుకున్న టైంకే వస్తుందా రాదానే డౌట్లు రావడం సహజం. వీటికో క్లారిటీ వస్తోంది.

యూనిట్ టాక్ ప్రకారం హరిహర వీరమల్లు చివరి షెడ్యూల్ ఏప్రిల్ 7 నుంచి 14 వరకు జరగనుంది. ఇందులో పవన్ కాల్ షీట్లు అవసరమయ్యే రోజులు కేవలం నాలుగు. సో పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే షూట్ మొత్తం దాదాపు పూర్తయ్యింది. హీరో అవసరం లేని ఎపిసోడ్లన్నీ దర్శకుడు జ్యోతి కృష్ణ చకచకా తీసేశారు. క్రిష్ డైరెక్ట్ చేసిన భాగాన్ని దీంతో కలిపి ఒక ఫైనల్ ఎడిట్ కాపీని సిద్ధం చేసే పనిలో టీమ్ బిజీగా ఉంది. విఎఫ్ఎక్స్ మీద పలు విదేశీ కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. అవి కూడా కొలిక్కి వచ్చినట్టే. సెన్సార్ ని ఏప్రిల్ చివరి వారంలోగా పూర్తి చేయాలనేది నిర్మాత ఏఎం రత్నం టార్గెట్.

సో ఇక ఫాన్స్ నిశ్చింతగా హరిహర వీరమల్లు ప్రమోషన్లలో భాగం కావొచ్చు. ఇది మొదటి భాగం కావడంతో సీక్వెల్ ఎప్పుడు ప్లాన్ చేయాలనే దాని మీద కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇన్ సైడ్ ఇన్ఫో అయితే పార్ట్ 2 కూడా కీలక భాగం పూర్తయ్యిందట. పవన్ కళ్యాణ్ డేట్లు ఎక్కువ అవసరం లేకుండా వీలైనంత వేగంగా తీసేలా ప్లాన్ చేస్తున్నారట. కాకపోతే పార్ట్ 1 ఎంత స్థాయిలో సక్సెస్ అవుతుందనే దాన్ని బట్టి స్పీడ్ ఆధారపడి ఉంటుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ హిస్టారికల్ డ్రామాలో ఔరంగజేబుగా బాబీ డియోల్ పోషించిన పాత్ర, ఎంఎం కీరవాణి సంగీతం కీలకం కానున్నాయి.