ఈ మధ్య కాలంలో కొన్ని సినిమా పాటల్లో చేస్తున్న నృత్య రీతుల పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా మహిళా కమీషన్ సీరియస్ గా స్పందించడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మహిళలను కించపరిచే విధంగా కొన్ని స్టెప్పుల గురించి తమకు ఫిర్యాదులు అందాయని, ఇది సమాజంపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున ఆ ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఇకపై వీటిని పునరావృత్తం కాకుండా చూసుకునే బాధ్యత నిర్మాత, దర్శకుడు, నటీనటులు, కొరియోగ్రాఫర్లదేనని హెచ్చరిస్తూ, ఇకపై చర్యలు ఉంటాయని ప్రెస్ మీట్ విడుదల చేయడంతో పరిశ్రమలో చర్చ మొదలయ్యింది.
ప్రత్యేకంగా ఫలానా సినిమా గురించని పేర్కొనలేదు కానీ ఈ ఇష్యూకి కారణం ఇటీవలే రిలీజైన రాబిన్ హుడ్ లో అదిదా సర్ప్రైజ్ పాటతో పాటు గతంలో వచ్చిన డాకు మహారాజ్, మిస్టర్ బచ్చన్ సాంగ్సే. ఈ మూడింటికి శేఖర్ మాస్టరే కొరియోగ్రాఫర్ కావడం గమనించాల్సిన విషయం. అసభ్యత సంగతి కాసేపు పక్కనపెడితే ఈ పబ్లిసిటీ రిలీజ్ కు ముందు ఆయా చిత్రాలకు ఉపయోగపడిందనేది వాస్తవం. కానీ అంతే మోతాదులో విమర్శలు కూడా వచ్చాయి. హీరోయిన్లను ట్రీట్ చేస్తున్న విధానం పట్ల నెగటివ్ కామెంట్స్ వెల్లువెత్తాయి. దానికి ఆయా దర్శకుల సమర్ధింపు ఎలా ఉన్నా ఇప్పుడీ పబ్లిక్ నోటీస్ ఊహించని పరిణామం.
ఇప్పటికిప్పుడు వాటిని మార్చలేరు కానీ రాబోయే రోజుల్లో నృత్య దర్శకులు జాగ్రత్తగా ఉండేందుకు మహిళా కమిషన్ స్పందన ఉపయోగపడుతుంది. కేవలం కొన్ని నిముషాలు వచ్చే పాటల మీద ఇంత ఫోకస్ అవసరమాని కొందరు అనొచ్చు. కానీ ఇది అక్కడితో ఆగేది కాదు. కొన్ని వేలు లక్షల యూత్ రీల్స్ పేరిట అవే స్టెప్పులను సోషల్ మీడియా పాపులారిటీ కోసం వీడియోలు చేస్తున్నారు. వాళ్లలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇలాగే ఉపేక్షిస్తే ఇతర కొరియోగ్రాఫర్లు కూడా ఇదే బాట పట్టే ప్రమాదం ఉందని గుర్తించే ఈ హెచ్చరికను జారీ చేశారని చెప్పొచ్చు. చూడాలి ఇకపై ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో.