‘శాటిలైట్’కు ఓటీటీ దెబ్బ

సినిమాలకు థియేట్రికల్ రైట్స్ తర్వాత ఇంతకుముందు అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతూ ఉన్నది శాటిలైట్ హక్కులే. ఐతే గత కొన్నేళ్లలో వాటికి దీటుగా డిజిటల్ రైట్స్ ఆదాయం కూడా పెరిగింది. శాటిలైట్ హక్కుల్ని మించి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఎక్కువ రేటు పలకడం మొదలైంది కొన్నేళ్ల ముందు. డిజిటల్ హక్కుల ధర పెరగడంతో పాటే శాటిలైట్ రేటు కొంచెం తగ్గడమూ జరిగింది.

ఈ మధ్య శాటిలైట్ హక్కుల విలువ మరీ పడిపోతూ వస్తోంది. ఆ మార్కెట్‌ మరింతగా దెబ్బ తినే పరిస్థితులు కనిపిస్తున్నాయిప్పుడు. థియేటర్లు మూత పడి ఉన్న సమయంలో కొత్త సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యే సంస్కృతి మొదలయ్యాక శాటిలైట్ హక్కుల డిమాండ్ బాగా పడిపోయింది. లాక్ డౌన్ టైంలో ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఓటీటీ సబ్‌స్క్రైబర్లు ఉంటున్నారు.

ఓటీటీల్లో కొత్త సినిమా రిలీజవడం ఆలస్యం ఫ్యామిలీ అంతా కలిసి చూసేస్తున్నారు. దీంతో ఆ తర్వాత టీవీలో సినిమా రిలీజైతే పట్టించుకునే పరిస్థితి ఉండట్లేదు. ఆ మధ్య నవీన్ చంద్ర సినిమా ‘భానుమతి రామకృష్ణ’ ఆహా ఓటీటీలో రిలీజై మంచి స్పందనే రాబట్టుకుంది. కానీ దాన్ని టీవీలో రిలీజ్ చేస్తే మరీ దారుణమైన టీఆర్పీ వచ్చింది. అసలేమాత్రం జనాలు పట్టించుకోలేదు.

‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’కూడా ఆశించిన స్పందన లేదు. రేప్పొద్దున వి, నిశ్శబ్దం లాంటి సినిమాలను రిలీజ్ చేసినా రెస్పాన్స్ పెద్దగా ఉండదన్నది స్ఫష్టం. ఒక ఫ్యామిలీ థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం అంటే అంత ఈజీ కాదు. కానీ మన టీవీలో కొత్త సినిమా వస్తోందంటే ఫ్యామిలీ అంతా కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాను టీవీలో ప్రసారం చేస్తే ఎక్కడ పట్టించుకుంటారు. ఈ నేపథ్యంలో శాటిలైట్ మార్కెట్ పడిపోతోంది.

లాక్ డౌన్ టైంలో అన్ని ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో రేప్పొద్దున థియేటర్లు మామూలుగా నడిచాక కూడా పరిస్థితి మారదు. ముందు థియేటర్లలో సినిమా చూస్తారు. ఆ తర్వాత ఓటీటీల్లో రిలీజ్ ఉంటుంది. టీవీల్లో వచ్చే లోపే మెజారిటీ ప్రేక్షకులు సినిమా చూసేసి ఉంటారు. కాబట్టి టీఆర్పీలతో పాటు శాటిలైట్ మార్కెట్ పడిపోవడం అనివార్యం.