మెగా అభిమానుల గగ్గోలు

తమ ఆరాధ్య కథానాయకులు వరుసబెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషించాలో.. అలా అనౌన్స్ చేస్తున్న సినిమాలు ఎగ్జైటింగ్‌గా లేవని బాధ పడాలో తెలియని అయోమయంలో ఉన్నారు మెగా అభిమానులు. వాళ్లెంతగానో అభిమానించే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి రీమేక్‌లకు ఓకే చెబుతుండటమే అభిమానులకు నచ్చలేదు.

తాజాగా పవన్ కళ్యాణ్ మలయాళం హిట్ ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లో నటించబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. ముందు ఈ సినిమాకు ఎవరెవరి పేర్లో వినిపించాయి. చివరికేమో పవన్ కళ్యాణ్, రాణా ఖరారయ్యారంటున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకుడట.

ఐతే ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులు విరగబడి చూసిన ‘అయ్యప్పునుం కోషీయుం’లో పవన్ నటించడమేంటి అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇది తెలుగులో కమర్షియల్‌గా వర్కవుటవదని, పవన్‌కు తగ్గ ఎలివేషన్ ఉన్న చిత్రం కాదని అంటున్నారు. అసలు రీమేక్ అంటేనే ఎగ్జైట్మెంట్ ఏముంటుందన్నది వాళ్ల ప్రశ్న.
రీఎంట్రీకి ‘పింక్’ రీమేక్‌‌ను ఎంచుకోవడం పట్ల కూడా పవన్ అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఐతే దాని తర్వాత క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిల సినిమాలు లైన్లో పెట్టడంతో సర్దుకున్నారు. కానీ ఇంతలో మధ్యలోకి ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ రావడంతో సోషల్ మీడియాలో తమ వ్యతిరేకతను దాచుకోకుండా చూపించేస్తున్నారు.

మరోవైపు చిరంజీవి సైతం ‘ఆచార్య’ తర్వాత ‘లూసిఫర్’, ‘వేదాళం’ లాంటి రొటీన్ మాస్ మసాలా సినిమాల రీమేక్‌లను లైన్లో పెట్టడం కూడా మెగా అభిమానులకు నచ్చట్లేదు. ఈ విషయంలోనూ తమ అసంతృప్తిని దాచుకోకుండా బయటపెట్టేస్తున్నారు. మెగా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండే పీఆర్వోలు తమ బాధను అర్థం చేసుకుని మెగా బ్రదర్స్‌కు విషయం తెలిసేలా చేయాలని అభిమానులు కోరుతున్నారు.