జన నాయకుడు వస్తే మనకు ఇబ్బందే

తలపతి విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయగన్ (జన నాయకుడు) షూటింగ్ అయితే వేగంగా జరుపుకుంటోంది కానీ విడుదల విషయంలో నిర్మాతలు తొందరపాటు ప్రదర్శించడం లేదు. కోలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లోనూ అంత సులభంగా చెరిగిపోని రికార్డులు దక్కేలా సరైన డేట్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఆ స్థాయిలో వసూళ్లు రావాలంటే తమిళంలో పొంగల్ సీజన్ చాలా కీలకం. యావరేజ్ మూవీస్ సైతం మతిపోగోట్టే కలెక్షన్లు రాబట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. సో 2026 సంక్రాంతికి జన నాయకుడు వచ్చే సూచనలు ఎక్కువ.

అయితే మనకేం ఇబ్బందనే పాయింట్ కు వద్దాం. వచ్చే ఏడాది పండక్కు తెలుగులో అఫీషియల్ గా ఆ సీజన్ లాక్ చేసుకునే దిశగా చూస్తున్న సినిమాల్లో మొదటిది జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో. మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ మెంట్ కూడా ఎప్పుడో ఇచ్చింది. దీన్ని ప్యాన్ ఇండియా రేంజ్ లో పెద్ద ఎత్తున మార్కెట్ చేస్తారు. కానీ విజయ్ వల్ల తమిళనాడు, కేరళలో కొంత ప్రతికూల ప్రభావం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇంకా షూటింగే మొదలుకాని చిరంజీవి – అనిల్ రావిపూడి వచ్చేది కూడా అప్పుడే. ఇది రీజనల్ క్యాటగిరీ కాబట్టి టెన్షన్ లేకపోయినా పక్కరాష్ట్రాల్లో తారక్ కు వచ్చే సమస్య చిరుకి మొదలవుతుంది.

ఒకవేళ వీటిలో ఏదైనా వాయిదా పడే పరిస్థితి వస్తే ప్రభాస్ ఫౌజీ లేదా రామ్ చరణ్ 16 వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం. జన నాయకుడుని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ చేతిలో యష్ టాక్సిక్ ఉంది. భవిష్యత్తులో బాలకృష్ణతో ఒక సినిమా ప్లాన్ చేస్తోంది. సో డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. జన నాయకుడికి థియేటర్లు వచ్చేలా చూసుకోవడంలో సహకరిస్తారు. భగవంత్ కేసరి రీమేక్ గా ప్రచారంలో ఉన్న జన నాయగన్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రేమలు మమిత బైజు కీలక పాత్ర చేస్తోంది. బాబీ డియోల్ విలన్. హెచ్ వినోత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.