గ్రేట్ న్యూస్: క్యాన్సర్‌ను జయించిన సంజయ్ దత్

ఇది భారతీయ సినీ ప్రేక్షకులందరికీ శుభవార్తే. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ క్యాన్సర్‌తో పోరాటంలో విజయం సాధించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. రెండు నెలల కిందట సంజయ్ దత్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరడం, ఆయనకు కరోనా ఉందన్న అనుమానాలు రావడం.. కానీ కరోనా నెగెటివ్‌గా తేలినప్పటికి తదుపరి పరీక్షల్లో ఊపిరి తిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడి కావడం కోట్లాది మంది సంజు అభిమానులను తీవ్ర విచారంలోకి నెట్టింది. క్యాన్సర్ మూడో దశ అనగానే సంజుకు ఏమవుతుందో అన్న ఆందోళన పెరిగిపోయింది.

ఐతే క్యాన్సర్ గురించి తెలియగానే ఆలస్యం చేయకుండా ముంబయిలోనే చికిత్స మొదలుపెట్టారు సంజుకి. కొన్ని రోజులు దుబాయ్‌లో కూడా ఉండి వచ్చాడు సంజు. అమెరికాకు కూడా వెళ్తాడన్న ప్రచారం జరిగింది.

కానీ చికిత్స విషయంలో ఏ అప్‌డేట్ ఇవ్వని సంజు.. ఇప్పుడు తాను క్యాన్సర్ పోరాటంలో విజేతగా నిలిచినట్లు సమాచారం పంచుకున్నాడు. గొప్ప యోధులకే దేవుడు అతి పెద్ద పోరాటాలని ఇస్తాడని.. తాను అలాగే పోరాడి ఈ యుద్ధంలో కూడా గెలిచానని అన్నాడు సంజు. తన పిల్లల పుట్టిన రోజుకు తాను ఆరోగ్యవంతుడిని కావడమే కానుక అని అతనన్నాడు.

90వ దశకంలో ముంబయి పేలుళ్లకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సంజుకు మాఫియాతో సంబంధాలున్నట్లు తేలడం, అతడికి జైలు శిక్ష పడటం దాదాపు నాలుగేళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన కొన్నేళ్ల కిందటే సంజయ్ బయటికి రావడం తెలిసిందే. ఈ కేసు విచారణ మొదలైనప్పటి నుంచి సంజు మానసిక వేదన ఎదుర్కొన్నాడు. చివరికి దీన్నుంచి బయటపడి కొన్నేళ్లుగా హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్న అతడిని క్యాన్సర్ ఆందోళనలోకి నెట్టింది.

ఐతే దీన్నుంచి త్వరగానే బయటపడటం అందరినీ సంతోషాన్నిస్తోంది. ఇటీవలే సంజు కేజీఎఫ్-2 చిత్రీకరణకు కూడా హాజరయ్యాడు. ఆయన మరో అరడజను సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. మొత్తం ప్రాజెక్టుల విలువ రూ.700 కోట్లు కావడం విశేషం.