గాయనిగా పరిచయమై.. నటిగా మంచి స్థాయిని చేరుకున్న తమిళ అమ్మాయి.. ఆండ్రియా. పెక్యులర్ వాయిస్తో ఆమె పాడిన కొన్ని పాటలు ఒకప్పుడు తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ గుర్తింపుతోనే ‘భరత్ అనే నేను’ చిత్రంలో కూడా ఓ పాట పాడింది ఆండ్రియా. తన వాయిస్ను మించిన ఆకర్షణ తన లుక్స్లోనూ ఉండడంతో ఆమెకు నటిగానూ ఛాన్సులు వచ్చాయి.
‘యుగానికి ఒక్కడు’తో మొదలుపెట్టి పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. ఇప్పటికీ తమిళంలో బిజీ ఆర్టిస్టుగానే ఉంది. విలక్షణ దర్శకుడు మిస్కిన్.. కొన్నేళ్ల ముందు ఆమె ప్రధాన పాత్రలో ‘పిసాసు-2’ మొదలుపెట్టాడు. తన దర్శకత్వంలోనే వచ్చిన ‘పిసాసు’కు అది సీక్వెల్. మొదలైనపుడే మంచి బజ్ తెచ్చుకుందీ చిత్రం. కానీ సినిమా పూర్తయినా.. విడుదలకు నోచుకోవడం లేదు. కారణాలేంటన్నది తెలియదు.
ఈ సినిమా గురించి ఓ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు చెప్పాడు మిస్కిన్. పిసాసు-2 కథ విన్నాక కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించేదుకు ఆండ్రియా అంగీకరించినట్లు మిస్కిన్ తెలిపాడు. కథకు అవసరం అనే ఆమె ఆ రిస్క్ చేయడానికి రెడీ అయిందన్నాడు. దీనికి సంబంధించి ఒక ఫొటో షూట్ కూడా చేయాలని తాను భావించినట్లు మిస్కిన్ తెలిపాడు. కానీ నగ్న సన్నివేశాలను యువత మరో కోణంలో చూస్తారేమో అనిపించి.. ఆండ్రియాను అలా చూపించే విషయంలో వెనుకంజ వేసినట్లు మిస్కిన్ చెప్పాడు.
ఒకవేళ ఆండ్రియా కనుక ఆ నేక్డ్ సీన్స్ చేసి ఉంటే సినిమాకు మంచి బజ్ వచ్చి ఈపాటికే ‘పిసాసు-2’ రిలీజ్ కూడా అయ్యేదని మిస్కిన్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. మిస్కిన్ మాటల్ని బట్టి చూస్తుంటే సినిమాకు బిజినెస్ జరగక, బడ్జెట్ సమస్యలు తలెత్తి ఇంకా విడుదలకు నోచుకోవట్లేదమో అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇళయరాజా సంగీతం వల్ల చాలామంది మద్యానికి బానిస అయ్యారనే మిస్కిన్ కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి.