వర్మ గారి సినిమాలు జీరో

రామ్ గోపాల్ వ‌ర్మ సినిమాల్లో క్వాలిటీ గురించి మాట్లాడుకునే రోజులు ఎప్పుడో పోయాయి. వివాదాస్ప‌ద అంశాల నేప‌థ్యంలో లేదంటే బూతు కంటెంట్‌తో సినిమాలు తీయ‌డం.. ప‌బ్లిసిటీ గిమ్మిక్కుల‌తో వాటి ప‌ట్ల ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెంచ‌డం.. అలా సొమ్ము చేసుకోవ‌డం.. ఇదీ వ‌రస‌. ఇలా కొన్నేళ్ల నుంచి బాగానే వెన‌కేసుకుంటూ వ‌స్తున్నాడు వ‌ర్మ‌.

లాక్ డౌన్ టైంలో పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో కొన్ని సినిమాలు రిలీజ్ చేసిన వ‌ర్మ‌కు మొద‌ట్లో బాగానే గిట్టుబాటైంది. కొన్ని ల‌క్ష‌ల పెట్టుబ‌డితో కోట్లు రాబ‌ట్టాడు కూడా. కానీ ఇప్పుడు అలాంటి గిమ్మిక్కులేవీ ప‌ని చేయ‌డం లేదు. వ‌ర్మ ఎంతో సెన్సేష‌న‌ల్ స్టోరీ తీసుకున్నా జ‌నాల్లో ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు. చివ‌ర‌గా వ‌ర్మ పే ప‌ర్ వ్యూ స్ట‌యిల్లో రిలీజ్ చేసిన సినిమాకు మినిమం రెస్పాన్స్ క‌ర‌వైంది.

దీనికి తోడు ఆయ‌న సినిమాల‌కు వ‌రుస‌గా లీగ‌ల్ ఇష్యూస్ త‌లెత్తుతున్నాయి. మిర్యాల‌గూడ ప్ర‌ణ‌య్‌-అమృత‌ల క‌థ‌తో తెరకెక్కించిన మ‌ర్డ‌ర్ విడుద‌ల‌కు నోచుకోలేక‌పోయింది. ఇప్పుడు దిశ ఎన్‌కౌంట‌ర్ సినిమా ప‌రిస్థితీ ఇలాగే త‌యారైంది. క‌రోనా వైర‌స్ అంటూ ఓ సినిమా తీస్తే అది ఏమాత్రం జ‌నాల దృష్టిని ఆక‌ర్షించ‌లేక‌పోయింది. ఈ సినిమాను పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో రిలీజ్ చేసినా ఆశించిన‌ రెస్పాన్స్ వ‌చ్చేలా లేదు.

లాక్ డౌన్ త‌ర్వాత తొలి థియేట్రిక‌ల్ రిలీజ్ ఇదే అని వ‌ర్మ ప్ర‌క‌టించ‌గా.. పట్టించుకున్న నాథుడు లేడు. ఈ సినిమా అలా రిలీజైతే మెయింటైనెన్స్ ఖ‌ర్చులైనా వ‌స్తాయా అన్న‌ది డౌటు. ఆర్జీవీ మిస్సింగ్ అంటూ ఇంకేదో సిల్లీ సినిమా తీస్తున్నాడు కానీ.. దాని ప‌ట్లా ఎవ‌రికీ ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు. మొత్తంగా చూస్తే వ‌ర్మ ప‌బ్లిసిటీ గిమ్మిక్కుల‌కు జ‌నం ప‌డిపోయే రోజులు పోయిన‌ట్లే ఉంది. ఇక జ‌నం నుంచి వ‌ర్మ డ‌బ్బులు లాగాలంటే క‌ష్ట‌మే.