వైసీపీ ఇళ్ల స్థలాలపై పవన్ సంచలన వ్యాఖ్యలు

జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోమారు ఏపీ ప్ర‌భుత్వం తీరుపై ఘాటు వ‌ద్యాఖ్య‌లు చేశారు. అయితే ఈ ద‌ఫా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను కాకుండా ఆ పార్టీ నేత‌ల‌ను ప‌వ‌న్ టార్గెట్ చేశారు. ఏపీ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న ఇళ్ల అంశాన్ని ప్ర‌స్తావిస్తూ, ఇళ్ల నిర్మాణ ప్ర‌జ‌ల సంక్షేమం కోణంలో జ‌ర‌గ‌డం లేద‌ని వైసీపీ నేత‌ల జేబులు నింపేందుకే ఈ ప్ర‌క్రియ సాగుతోంద‌ని ఆరోపించారు. త‌న ఫాంహౌస్‌లో ప‌వ‌న్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూను జ‌న‌సేన విడుద‌ల చేసింది.

గృహ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యం ఇచ్చి అన్ని రాష్ట్రాల వ‌లే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోనూ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించారని ప‌వ‌న్ తెలిపారు. ఇళ్ల‌ నిర్మాణం చేపట్ట‌డం, కొన్ని చోట్ల పూర్త‌వ‌డం జ‌రిగిన అనంత‌రం ప్రభుత్వం మారిపోవ‌డంతో వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా నిలిపేశారని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఈ విష‌యంలో ప్రజాధనం విపరీతంగా దుర్వినియోగం అవుతోందని ప‌వన్‌ ఆరోపించారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాగే ఇళ్లు కట్టి వదిలేశారని పేర్కొన్న ప‌వ‌న్ ప్రస్తుతం అవి శిధిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా జీ+3 గృహాల నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని మండిప‌డ్డారు. రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు కట్టిన తర్వాత కూడా ఇళ్లు రాక లబ్దిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఇటీవ‌ల తాను కర్నూలులో ప‌ర్య‌టించిన‌పుడు జీ +3 గృహ సముదాయాలు ప్రత్యక్షంగా చూశానని ప‌వ‌న్ వెల్ల‌డించారు. బాధితులతో మాట్లాడినప్పుడు వారు తమకు న్యాయం చేయాలని కోరారని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఇళ్లు కట్టింది త‌మ పార్టీ కాదని, మా పార్టీకి కాకుండా మ‌రో పార్టీకి ఓటు వేశార‌ని వైసీపీ నేత‌లు పేర్కొంటూ అర్హుల‌కు ఇళ్లు ద‌క్క‌కుండా చేస్తున్న‌ర‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోపించారు.

పేద‌ల‌కు ఇళ్ల కేటాయింపు వ్యవహారంలో పాలకుల నిర్లక్ష్యంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైసీపీ నేతల సంపాదన కోసమే ఇళ్ల స్థలాల ప్లాన్ చేశార‌ని ఆరోపించిన ప‌వ‌న్ ఆ పార్టీ నేత‌లు సూచించిన వారికే ఇళ్లు ఇస్తున్నారు త‌ప్పించి అర్హుల‌కు కేటాయించ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఎవ‌రి ఓటు వేశారు అనే మాటలు కాకుండా ఖచ్చితంగా అర్హులైన లబ్దిదారులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణం సమస్యపై బీజేపీతో కలసి సమష్టిగా ముందుకు వెళ్తామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు.