అటు హీరో వెంక‌టేశ్‌కు.. ఇటు పొంగులేటికి వియ్యంకుడు

Ramasahayam Raghurama Reddy

రామస‌హాయం ర‌ఘురాం రెడ్డి.. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పేరు ఇది. ఎంతో ఉత్కంఠ నెల‌కొన్న ఖ‌మ్మం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ద‌క్కించుకున్న ర‌ఘురాం రెడ్డి గురించి ఇప్పుడు చ‌ర్చ జోరందుకుంది. మొత్తానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంతం ద‌క్కించుకుని త‌న వియ్యంకుడైన ర‌ఘురాం రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ర‌ఘురాం రెడ్డి కేవ‌లం పొంగులేటికే కాదు అగ్ర సినీ నాయ‌కుడు వెంక‌టేశ్‌కు కూడా వియ్యంకుడే.

వెంక‌టేశ్ పెద్ద త‌న‌య అశ్రిత‌ను ర‌ఘురాం రెడ్డి పెద్ద కొడుకు వినాయ‌క్ రెడ్డికి ఇచ్చి 2019లో జైపుర్‌లో ఘ‌నంగా పెళ్లి చేశారు. ప్ర‌స్తుతం ఆ దంప‌తులు స్పెయిన్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక ర‌ఘురాం రెడ్డి చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి ఏమో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వ‌ప్ని రెడ్డిని వివాహమాడారు. ఇలా అటు సినిమా రంగానికి చెందిన వెంక‌టేశ్‌తో ఇటు రాజ‌కీయ రంగానికి చెందిన పొంగులేటితో ర‌ఘురాం రెడ్డికి ద‌గ్గ‌రి సంబంధాలున్నాయి. ఇక ర‌ఘురాం ర‌క్తంలోనే రాజ‌కీయం ఉంద‌ని చెప్పాలి.

ఒక‌ప్ప‌టి అగ్ర‌నేత సురేంద‌ర్ రెడ్డి త‌న‌యుడే ఈ ర‌ఘురాం రెడ్డి. పీవీ న‌ర‌సింహారావుకు అత్యంత స‌న్నిహితుడిగా సురేంద‌ర్‌కు పేరుంది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని డోర్న‌క‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వ‌రంగ‌ల్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగానూ విజ‌యం సాధించారు. ఇప్పుడు ఆయ‌న కొడుకు ర‌ఘురాం రెడ్డి ఖ‌మ్మం లోక్‌స‌భ స్థానానికి పోటీ చేస్తూ వెలుగులోకి వ‌చ్చారు. మ‌రి తండ్రి బాట‌లో సాగుతున్న ఆయ‌న‌.. లోక్‌స‌భ‌లో అడుగుపెడ‌తారా? అన్న‌ది చూడాలి.