మోడీ సర్కారు.. ఒక విప్లవాత్మక నిర్ణయం

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఇప్పటిదాకా ఉన్న గందరగోళం, అస్పష్టతకు తెరదించుతూ.. ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకొచ్చింది. ఒక దేశం.. ఒకే పరీక్ష అనే రీతిలో కేంద్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీల కోసం ‘కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ నిర్వహించాలని నిర్ణయించింది.

ఇందుకోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) పేరుతో కొత్త సంస్థను కూడా ఏర్పాటు చేసింది. దీనికి యూపీఎస్సీ తరహాలో స్వయం ప్రతిపత్తి కూడా ఇస్తారు. దీనికి ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారిని నియమిస్తారు. దీని పరిధిలోకి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 20 నియామక సంస్థలను తీసుకొస్తారు. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒకటి చొప్పున మొత్తం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టు కింద ఏటా రెండుసార్లు నిర్వహించే పరీక్షల్లో సాధించే స్కోర్ మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. స్కోర్ పెంచుకోవడం కోసం అభ్యర్థులు మళ్లీ మళ్లీ పరీక్షలు రాయొచ్చు. దరఖాస్తు చేసే ఉద్యోగం ఏదైనా అత్యుత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలు 12 భాషల్లోనే జరుగుతుండగా.. ఈ టెస్టును మాత్రం రాజ్యాగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న భారతీయ భాషలన్నింట్లో నిర్వహిస్తారు. ఈ కొత్త విధానం వల్ల ఉద్యోగార్థులకు అనేక ప్రయోజనాలున్నాయి.

అన్ని పరీక్షలకు కలిపి ఒకేసారి నమోదు చేసుకోవచ్చు. వేర్వేరుగా ఫీజులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. సిలబస్ కూడా ఒకటే ఉంటుంది. పరీక్ష ఫలితాలు త్వరగా వెల్లడిస్తారు. నియామక కాలం కూడా తగ్గుతుంది. ఆన్ లైన్లోనే ఈ పరీక్ష జరుగుతుంది. సొంత జిల్లాలోనే పరీక్ష రాసుకునే సౌలభ్యం కలుగుతుంది.