ప్రపంచకప్ ఫైనల్లో పంత్ చేసిన గిమ్మిక్

ఫుట్‌బాల్‌లో పెనాల్టీ రాబట్టేందుకు ఆటగాళ్లు అద్భుతమైన నట విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు. ప్రత్యర్థి ఆటగాళ్లు తమను కనీసం తాకకున్నా.. వాళ్లు తమను గాయపరిచినట్లుగా నటిస్తుంటారు. అలాగే ఉద్దేశపూర్వకంగా అవతలి ఆటగాడిని గాయపరిచి తమకేమీ తెలియనట్లు నటించే వాళ్లూ ఉంటారు. ఫుట్‌బాల్‌లో ఉండే నటన మరే ఆటలో ఉండదు అంటే అతిశయోక్తి కాదు.

ఐతే క్రికెట్లో కూడా అప్పుడప్పుడూ కొన్ని ప్రయోజనాలు ఆశించి ఇలా నటించేవాళ్లుంటారు. గతంలో బైరన్నర్ కోసమని గాయం కాకున్నా అయినట్లు ఆటగాళ్లు నటించేవాళ్లు. ఐతే బైరన్నర్ రూలే తీసేసింది ఐసీసీ. కాగా ఈ ఏడాది దక్షిణాఫ్రికాపై భారత జట్టు అద్భుత విజయం సాధించిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో తమ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన నట విన్యాసం గురించి కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం బయటపెట్టాడు.

ఫైనల్లో దక్షిణాఫ్రికా ముందు 177 పరుగుల లక్ష్యం నిలవగా.. క్లాసెన్ చెలరేగడంతో 30 బంతుల్లో 30 పరుగులే చేయాల్సిన స్థితికి చేరుకుంది దక్షిణాఫ్రికా. కప్పు ఆ జట్టు సొంతమైనట్లే అని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ చివరి ఐదు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత్.. 7 పరుగుల తేడాతో గెలిచి కప్పు ఎగరేసుకుపోయింది. ఐతే క్లాసెన్ చెలరేగుతున్న టైంలో పంత్ చేసిన గిమ్మిక్ గురించి రోహిత్ తాజాగా వెల్లడించాడు.

తనకు కాలు పట్టేసినట్లు నటించిన మ్యాచ్‌లో చిన్న బ్రేక్ వచ్చేలా పంత్ చేసినట్లు రోహిత్ తెలిపాడు. మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు మళ్లిన సమయంలో త్వరగా పని అయిపోవాలని క్లాసెన్ భావించాడని.. ఆ స్పీడులో అతను మ్యాచ్‌ను ముగించేసేవాడని రోహిత్ అన్నాడు. ఆ టైంలో క్లాసెన్ వేగం తగ్గించడానికి, తమ వ్యూహాలు సమీక్షించుకోవడానికి చిన్న బ్రేక్ అవసరమైందని.. అప్పుడే పంత్ కాలు పట్టేసినట్లు చెప్పి ఫిజియోను రప్పించాడని.. కాలికి పట్టీ కూడా వేసుకున్నాడని.. ఆ విరామం తమకు మేలు చేసిందని.. క్లాసెన్ లయ దెబ్బ తిని వెంటనే ఔటైపోయాడని.. అక్కడి నుంచి తాము పట్టు బిగించి విజయం వైపు మళ్లామని.. అందుకే ఈ విజయంలో పంత్ పాత్ర కీలకమని రోహిత్ చెప్పాడు. ఈ విషయం తెలిసి భారత అభిమానులు సోషల్ మీడియాలో పంత్‌ను కొనియాడుతున్నారు.