భార్యతో అక్రమ సంబంధం.. మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చేశాడు

విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం ఒకటి వైఎస్సార్ కడపజిల్లాలో చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నోడి సంగతి చూసేందుకు అనూహ్య రీతిలో రియాక్టు అయ్యాడో భర్త. ఈ ఘటనలో రిలేషన్ పెట్టుకున్న అధికారి చనిపోగా.. భార్య తీవ్ర గాయాల బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సినిమాల్లో కూడా ఈ తరహా సీన్ చూసింది లేదు. అసలేం జరిగిందంటే..

వైఎస్సార్ కడప జిల్లాలోని వేముల మండలం కొత్తపల్లిలో ఈ ఫాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. అక్కడి స్థానిక వీఆర్వో నరసింహకు సుబ్బలక్ష్మమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయాన్ని గుర్తించాడు ఆమె భర్త బాబు. తనను మోసం చేసిన భార్యను.. ఆమె ప్రియుడిని కడతేర్చాలని భర్త ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా గగుర్పాటుకు గురయ్యేలా రివేంజ్ కార్యక్రమానికి ప్లాన్ చేశాడు.

భార్యతో వివాహేతర సంబంధం ఉన్న వీఆర్వో నరసింహ తన ఇంట్లో తన మంచం మీద తన భార్యతో నిద్రిస్తున్న వేళ.. ఆ మంచం కిందనే డిటోనేటర్లను అమర్చాడు. ఇవేమీ తెలియని నరసింహ ఎంచక్కా సుబ్బలక్ష్మమ్మ ఇంటికి వెళ్లాడు. ఇద్దరు మంచం మీద పడుకొని సేద తీరుతున్న వేళలో.. డిటోనేటర్లను ఒక్కసారిగా పేల్చేశాడు భర్త బాబు. దీంతో ఆ ధాటికి వీఆర్వో నరసింహ అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనలో సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఆమె చికిత్స పొందుతోంది. డిటోనేటర్లు పెట్టిన భర్త బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమన్న విషయాన్ని పోలీసులు తేల్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు మరిన్ని వివరాల కోసం విచారిస్తున్నారు.