నేపాల్‌లో కుప్ప‌కూలిన‌ విమానం.. 18 మంది మృతి!

భార‌త్ కు మిత్ర దేశం, పొరుగు దేశం కూడా అయిన నేపాల్‌లో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. దేశ రాజ‌ధాని ఖాఠ్మండులోని త్రిభువ‌న్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో టేకాఫ్ తీసుకుంటున్న స‌మ‌యంలో ఓ విమానం కుప్ప కూలిపోయింది. క‌ళ్లు మూసి తెరిచే లోగా జ‌రిగిన ఈ విషాద ఘ‌ట‌న‌లో సిబ్బంది స‌హా 18 మంది ప్ర‌యాణికులు మృతి చెందారు. పైల‌ట్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఖాఠ్మండు నుంచి పొఖారాకు బయల్దేరిన బాంబార్డియర్‌ సీఆర్‌జే 200 విమానం టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే కూలిపోయింది. ఉన్న‌ట్టుండి మంట‌లు చెల‌రేగి విమానం ద‌గ్ధ‌మైంది. శౌర్య ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో టేకాఫ్ అయింది. కానీ, ఇంత‌లోనే కుప్ప‌కూలింది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గాయపడిన పైలట్‌ను విమానం నుంచి బయటకు తీసి.. ఆసుపత్రికి తరలించారు.

ప్ర‌మాదానికి కార‌ణ‌మేంటి?

నేపాల్‌లో చోటు చేసుకున్న విమాన ప్ర‌మాదం ‘టేబుల్‌ టాప్‌’ గా పేర్కొనే రన్‌వే నే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఇలాంటి ర‌న్‌వేల‌పై టేకాఫ్‌.. సంక్లిష్టంగా ఉంటుంద‌ని నిపుణులు తెలిపారు. టేబుల్ టాప్‌.. అని పేరులో ఉన్న‌ట్టుగానే.. భూభాగం కంటేఎత్తులో ఈ ర‌న్‌వేలు ఏర్పాటు చేస్తారు. ఒకవైపు లేదా రెండు వైపులా లోయ మాదిరిగా ఉంటుంది. దీంతో విమానాల‌ను టేకాఫ్ చేసేప్పుడు.. ల్యాండింగ్ చేసేప్పుడు కూడా.. పైల‌ట్‌లు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

టేబుల్ టాప్ రన్ వేల‌పై నిర్ణీత ప్రాంతంలోనే విమానాలు ప్ర‌యాణించాలి. ఒక్క అడుగు ముందుకు వెళ్లినా.. వెన‌క్కి వెళ్లినా.. అదుపు త‌ప్పుతాయి. తాజా ఘ‌ట‌న‌లో విమానం టేకాఫ్ అయిన‌ప్పుడు.. నిర్ణీత మార్కింగ్‌ను దాటి ముందుకు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. అందుకే.. కింద స‌రైన ఎత్తులేక పోవ‌డంతో విమానం కూలిపోయి ఉంటుంద‌ని చెబుతున్నారు. దీనిపై ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతోంది.