17 ఏళ్ల నిరీక్షణకు తెర..

17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ టీమిండియా టీ20 ప్రపంచ కప్ సాధించింది. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును మట్టి కరిపించి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో సఫారీ జట్టుపై భారత్ 7 పరుగుల తేడాతో చరిత్రాత్మక విజయం సాధించింది.

ఈ హైటెన్షన్ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డ టీమిండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. ఫామ్ లేమితో సతమతమవుతున్న కింగ్ కోహ్లీ ఈ రోజు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 76 పరుగులు చేసిన కోహ్లీకి అక్షర్ పటేల్ 47, శివమ్ దూబే 27ల నుంచి సహకారం లభించింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సఫారీ బ్యాట్స్ మన్లలో హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 57 పరుగులతో వీర విహారం చేశాడు. అయితే, క్లాసెన్ ను హార్దిక్ పాండ్యా అవుట్ చేసి మ్యాచ్ ను మలుపు తిరిగింది. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన సందర్భంగా హార్దిక్ పాండ్యా మ్యాజిక్ చేశాడు. తొలి బంతికి మిల్లర్ వికెట్ తో పాటు మరో వికెట్ తీసిన పాండ్యా 8 పరుగులే ఇవ్వడంతో భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది.

టీ20 వరల్డ్ కప్ టైటిల్ ను రెండు సార్లు గెలుచుకున్న మూడో జట్టుగా భారత్ అవతరించింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ ల సరసన భారత్ చేరింది. 2007లో ధోనీ నాయకత్వంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవగా 17 ఏళ్ల తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో కప్ గెలిచారు. 2014 టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ చేరినా శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయింది.