రాయుడి మాటలను ఇలానా అర్థం చేసుకునేది?

తెలుగవాడైన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు ఇప్పుడు ఉన్నట్లుండి భారత బ్యాటింగ్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి అభిమానులకు పెద్ద శత్రువుగా మారాడు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా కోహ్లి, అతను ప్రాతినిధ్యం వహించే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద రాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడమే అందుక్కారణం.

గత ఏడాది వరకు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆడిన అంబటి రాయుడు.. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఈ సీజన్లో వ్యాఖ్యాతగా మారిన సంగతి తెలిసిందే. ఇంతకుముందే ఓ సందర్భంలో అతను కోహ్లి ప్రాతినిధ్యం వహించే బెంగళూరు జట్టులో సమష్టి తత్వం ఉండదని.. కేవలం కొందరు స్టార్ ఆటగాళ్లనే నమ్ముకుంటే కప్పు గెలవడం కష్టమని నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పాడు. ఫైనల్ అనంతరం వేరే వ్యాఖ్యాతలతో కలిసి మాట్లాడుతూ మరోసారి ఇదే తరహాలో మాట్లాడాడు.

ఐతే కోహ్లి గురించి ఈ సందర్భంగా రాయుడు చాలా పాజిటివ్‌గానే మాట్లాడాడు. కోహ్లి నెలకొల్పిన అత్యున్నత ప్రమాణాలను జట్టులో ఇతర ఆటగాళ్లు అందుకోలేకపోతున్నారని.. మిగతా ఆటగాళ్లు రాణించనపుడు కోహ్లి ఒక్కడు సత్తా చాటితే కప్పు రాదని అతను వ్యాఖ్యానించాడు. ఐతే ఈ వ్యాఖ్యలన్నీ పట్టించుకోకుండా మధ్యలో రాయుడు చేసిన ఒక కామెంట్‌ను కొందరు వివాదాస్పదం చేశారు. ‘‘ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నంత మాత్రాన కప్పు రాదు’’ అన్నదే ఆ కామెంట్. ఈ సీజన్లో కోహ్లి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ కామెంట్‌ వైరల్ కావడంతో కోహ్లి ఫ్యాన్స్ రాయుడి మీద కొన్ని రోజులుగా విరుచుకుపడుతున్నారు. అంతటితో ఆగకుండా తన భార్యా పిల్లలను టార్గెట్ చేస్తున్నారట. రాయుడి మిత్రుడు ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో దీని గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. రాయుడి భార్య.. అతడి ఇద్దరు పిల్లలను చంపేస్తామంటూ సోషల్ మీడియా ద్వారా.. అలాగే ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నామని అతను కోహ్లి అభిమానుల తీరును తప్పుబట్టాడు. కానీ రాయుడు చెప్పిన మంచి విషయాలను వదిలేసి.. ఒక కామెంట్‌ను పట్టుకుని కోహ్లి ఫ్యాన్స్ కొందరు వివాదాస్పదం చేయడమే విడ్డూరం.