అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో ఒకసారి లిఫ్ట్ ప్రమాదం, రెండో సారి కారు ప్రమాదం తప్పించుకున్న ఆమె మూడోసారి ఔటర్ రింగ్ రోడ్డు కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.

తాజాగా అమెరికాలో జరిగిన ప్రమాదంలో సంగారెడ్డికి చెందిన తెలుగు వ్యక్తి కారు ప్రమాదం నుండి తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇస్తుండగా ఆ వెనకనే వచ్చిన మరో కారు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలో విద్యుత్‌ శాఖ ఉద్యోగి మధుర వెంకటరమణ పదవీ విరమణ అనంతరం కుటుంబంతో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పరిధిలోని అలకాపురిలో స్థిరపడింది. అనారోగ్యంతో రెండేళ్ల కిందటే ఆయన మృతి చెందారు. అయన కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ (30) ఎనిమిదేండ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాడు. పృథ్వీరాజ్‌ యూఎస్‌లోని నార్త్‌ కరోలినాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది శ్రీప్రియను వివాహం చేసుకున్న పృథ్వీరాజ్‌.. భార్యతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్యతో కలిసి బుధవారం కారులో వెళ్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో వీరి కారు ముందు వెళ్తున్న మరో కారును ఢీ కొట్టింది. దీంతో అది రోడ్డుపై పల్టీలు కొట్టింది. అదే సమయానికి తమ కారులో బెలూన్లు తెరుచుకోవడంతో దంపతులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.

అనంతరం భార్యను కారులోనే కూర్చోబెట్టి, బయటికి వచ్చిన పృథ్వీరాజ్‌ ప్రమాద ఘటనపై పోలీసులకు సమాచారం అందించేందుకు ఫోన్‌ చేస్తుండగా, అటుగా వేగంగా వచ్చిన మరో కారు ఆయన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎదిగిన కొడుకు మృత్యువాత పడటంతో వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకురానున్నట్లు సమాచారం.