మూడు కోట్లు ఇచ్చి నిశ్చితార్ధం రద్దు చేసుకో

ఒకప్పుడు లక్షలాది రూపాయల కట్నకానుకలు ముట్టచెబితేనే కానీ అమ్మాయిల పెళ్లిళ్లు కావడం కష్టమయ్యేది. లేకపోతే అత్తారింటి వేధింపులు భరించాల్సి వచ్చేది. ఇప్పుడు రోజులు మారిపోయాయి. పెళ్లి చేసుకునే అమ్మాయిలు బెదిరింపులకు దిగడం ఫ్యాషన్ అయిపోయింది.

తిరుపతిలో జరిగిన ఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి నిశ్చితార్ధం చేసుకున్న కాబోయే వరుడ్ని వేధించడం మొదలుపెట్టింది ఒక యువతి. 3 కోట్ల రూపాయలు ఇచ్చి నిశ్చితార్ధం రద్దు చేసుకోమని బెదిరింపులకు దిగింది. ఈ వివాదం పోలీసు స్టేషన్ గడప తొక్కడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన వంశీ చెన్నై విజయ హాస్పిటల్ లో సైంటిస్ట్ గా చేస్తున్నాడు. డేటింగ్ యాప్ ద్వారా ఆయనకు వనస్థలిపురంకు చెందిన నమ్రత పరిచయం అయ్యింది. అదికాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెద్దలను ఒప్పించారు. వారి సమక్షంలో నిశ్చితార్ధం జరిగింది. కొన్ని రోజులకే నమ్రత అసలు రూపం బయట పడింది.

వంశీ పేరిట వున్న ఆస్తులను తన పేరు మీద మార్చాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే ఆస్తి ఎలా మారుస్తానంటూ ప్రశ్నించిన వంశీ ని బెదిరించడం స్టార్ట్ చేసింది. ఇది భరించలేక పెద్దల ద్వారా నిశ్చితార్ధం రద్దు చేసుకున్నాడు. పెళ్లి పేరుతో మోసం చేసాడంటూ వంశీ మీద వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతటితో ఊరుకోలేదు నమ్రత. నిశ్చితార్ధం రద్దు చేసుకోవాలంటే 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే నీ కుటుంబాన్ని చంపేస్తామని వార్నింగ్ ఇస్తూ మెయిల్ ద్వారా వేధించడం మొదలుపెట్టింది. ఈ టార్చర్ ను భరించలేని వంశీ తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. దాంతో నమ్రత మీద కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

పూర్వం రోజుల్లో పెళ్లంటే నూరేళ్ళ పంటగా భావించే వారు. ఇప్పుడు పెళ్లిళ్లు ఖరీదైన వ్యాపారంగా మారి పోయాయి. గుణగణాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆస్తి పాస్తుల పునాదులపై సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. దీని వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. భార్యా భర్తలు స్నేహితులుగా కాకుండా వ్యాపార భాగస్వాములుగా మారిన నేపథ్యంలో ఇలాంటి ఆర్ధిక వివాదాలు సహజమేనని సామాజిక వేత్తలు అభివర్ణిస్తున్నారు.