ఇది క‌దా.. ప‌త‌నం అంటే

సిరితా వ‌చ్చిన వ‌చ్చును… పోయిన పోవును.. అన్న‌ట్టుగా ప‌త‌నం ముంగిట చివురుటాకులా వ‌ణుకుతోంది.. ఆన్‌లైన్ పాఠాలు బోధించే బైజూస్ అగ్ర‌సంస్థ‌! అయితే.. ఈ ప‌త‌నం కూడా.. కేవ‌లం 12 మాసాల్లోనే చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఉవ్వెత్తున ఎగిసి ప‌డిన స‌ముద్ర కెర‌టంగా దేశ‌వ్యాప్తంగా అన‌తి కాలంలోనే గుర్తింపు పొందిన ఈ స్టార్ట‌ప్‌.. అంతే వేగంగా ప‌త‌నం బాట ప‌ట్టింది. దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ గా బిజినెస్ ప్రపంచంలో ప్రశంసలు అందుకుంది. అయితే, ఒకే ఒక్క ఏడాదిలో అంతా తారుమారైంది.

ఏడాదికింద‌ట బైజూస్ రూ.17 వేల కోట్ల నెట్ వర్త్ తో ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు పొందింది. బైజూస్ అంటేనే.. ఇక ఇమేజ్‌ను తీసుకువ‌చ్చారు…ఈ సంస్థ అధిప‌తి ర‌వీంద్ర‌న్‌. ముఖ్యంగా క‌రోనా కాలంలో దాదాపు దేశ‌వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో బైజూస్ పేరు మార్మోగింది. కానీ, అనూహ్యంగా ఈ సంస్త న‌ష్టాల బాట ప‌ట్టింది. గతేడాది దాకా లగ్జరీ జీవితం అనుభవించిన ర‌వీంద్ర‌న్‌.. పరిస్థితి ఇప్పుడు ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు చేతులు త‌ముడుకునే స్థాయికి దిగ‌జారింది.

ముచ్చటపడి కొనుక్కున్న ఇంటిని తాకట్టు పెట్టాల్సిన స్థితికి చేరింది. 2011లో ప్రారంభ‌మైన బైజూస్ ప్రైమరీ క్లాస్ నుంచి ఎంబీఏ గ్రాడ్యుయేట్ల దాకా ఆన్ లైన్ లో పాఠాలు బోధించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో బైజూస్ వాల్యూ అమాంతంగా పెరిగిపోయింది. 2022లో ఆయన సంపద ఏకంగా 22 బిలియన్ డాలర్లకు చేరడంతో రవీంద్రన్ పేరును ఫోర్బ్స్ జాబితాలోకి చేర్చింది. అయితే, కంపెనీ అనుసరించిన పలు విధానాలు, సీఈవోగా రవీంద్రన్ తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టి కంపెనీని నష్టాల్లోకి నెట్టాయి.

దీంతో రాకెట్ వేగంతో పైకెదిగిన బైజూస్.. అదే వేగంతో చతికిలపడింది. ఈ ఏడాదికి సంబంధించి ఇటీవల ఫోర్బ్స్ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. అందులో బైజూస్ అధినేత రవీంద్రన్ తో పాటు మరో ముగ్గురు చోటు కోల్పోయారు. 2022 లో 22 బిలియన్ డాలర్ల నెట్ వర్త్ తో ఉన్న బైజూస్ సీఈవో.. ఈ ఏడాది 1 బిలియన్ కన్నా తక్కువకు పడిపోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. ప‌త‌నం అంటే ఈ స్తాయిలో ఉంటుందా? అని అంద‌రూ నివ్వెర పోయేలా చేసింది బైజూస్ అనుభ‌వం.