ఆస్ట్రేలియాలో తెలంగాణ మ‌హిళ దారుణ హ‌త్య‌.. చెత్త‌కుప్ప‌లో శవం

దేశం కాని దేశంలో తెలంగాణ‌కు చెందిన మ‌హిళ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఆమెను దారుణంగా చంపేసిన హంత‌కులు.. శ‌వాన్ని చెత్తకుప్ప‌లో పూడ్చి వెళ్లారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ కు చెందిన మాదగాని బాల్ శెట్టిగౌడ్‌ కుమార్తె చైతన్య.. తన భర్త అశోక్ రాజ్ తో కలిసి విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్ సమీపంలో గల మిర్కావేలో నివాసం ఉంటున్నారు.

వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. కొద్ది రోజుల క్రితమే చైతన్య భర్త అశోక్ రాజ్ తో కలిసి విదేశాలకు వెళ్లారు. వారి ఇంటికి 86 కి.మీ దూరంలోని చెత్త కుండీలో ఆమె మృతదేహం లభ్యమైంది. శనివారం మధ్యాహ్నం మృత దేహాన్ని గుర్తించిన అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని పరిశీ లించి.. చైతన్య మరణంపై ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. చైతన్య నివాసానికి వెళ్లి పలు ఆధారాలు సేకరించారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త, కుటుంబ సభ్యులను విచారించిన అనంతరమే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా, దీని వెనుక కుటుంబ త‌గాదాలు.. భ‌ర్త ఆగ‌డాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చైత‌న్య, అశోక్‌రాజ్‌ల‌ది పెద్ద‌లు కుదిర్చిన వివాహంగా చెబుతున్నారు. ఉపాధా నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉంటున్న అశోక్‌.. ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌ర‌చుగా భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య వివాదాలు వ‌స్తున్నాయ‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఆమె దారుణ హ‌త్య‌కు భ‌ర్తే కార‌ణ‌మా? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.