అప్పుడు ఉల్లి.. ఇప్పుడు వెల్లుల్లి.. పొలాల‌కు కెమెరాలు!

గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో ఉల్లిపాయ‌ల ధ‌ర‌లు ఆకాశానికి అంటాయి. కిలో 100 కు చేరుకున్నాయి. అయితే.. ఇప్పుడు నిత్యావ‌స‌రాల్లోముఖ్యంగా కూర‌ల్లో రుచి క‌లిగించే కీల‌క‌మైన వెల్లుల్లిపాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో 550 వ‌ర‌కు చేరుకున్నాయి. దీంతో సాధార‌ణ ప్ర‌జ‌లు బెంబేలెత్తుతున్నారు. అయినా.. త‌ప్పదు క‌దా.. అని అంతో ఇంతో కొని.. వాడుతున్నారు. ఈ ధ‌ర‌లు మ‌రో నాలుగు మాసాల వ‌ర‌కు అంటే.. కొత్త పంట చేతికి ఇబ్బడి ముబ్బ‌డిగా వ‌చ్చే వ‌ర‌కు త‌గ్గే ప‌రిస్థితి లేదు.

ఇక‌, సాధార‌ణ నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు జోక్యం చేసుకుని ధ‌ర‌లు త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించే ప్ర‌భుత్వాలు.. సుగంధ ద్ర‌వ్యాల జాబితాలో ఉన్న వెల్ల‌ల్లి ధ‌ర‌ల విష‌యంలో మాత్రం మౌనంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క రేటుకు వెల్లుల్లి అమ్ముతున్నారు. తెలంగాణలో 500 రూపాయ‌లు ఉండ‌గా.. ఏపీలో 450రూపాయ‌ల వ‌ర‌కు ప‌లుకుతున్నాయి. ఇక‌, రాజ‌స్థాన్ స‌హా ఉత్త‌రాది రాష్ట్రాల్లో 600 రూపాయ‌ల వ‌ర‌కు వెల్లుల్లిధ‌ర‌లు ప‌లుకుతున్నాయి.

ఇక‌, గ‌తంలో ఉల్లిపాయ‌లు, ట‌మాటాల‌ దొంగ‌ల వ్య‌వ‌హారం.. వెలుగు చూసిన‌ట్టుగానే ఇప్పుడు వెల్లుల్లి దొంగ‌లు కూడా రెడీ అయ్యారు. దీంతో వెల్లుల్లి రైతులు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొంటున్నా రు. మార్కెట్లో నాణ్యమైన వెల్లుల్లి కిలో ధర రూ.500 పలుకుతుండటంతో ఈ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్‌ ప్రాంతంలోని అయిదారు గ్రామాల పొలాల్లో కొన్ని వెల్లుల్లి చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో రైతులు సీసీ కెమెరాలు అమర్చుకొన్నారు.