`బంధానికి` మ‌రో చిక్కు.. స్లీప్ డైవ‌ర్స్‌లో భార‌త్ ఫస్ట్!

అన్యోన్య కాపుర‌మే.. వైవాహిక బంధానికి.. చూడ‌ముచ్చ‌టైన జంట‌కు.. నిద‌ర్శ‌నం. అయితే.. కార‌ణాలు ఏవైనా ఇప్పుడు ఈ బంధానికి ఇప్పుడు `స్లీప్ డైవ‌ర్స్‌` చిక్కులు తెస్తోంది. తాజాగా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రిగిన ఓ స‌ర్వేలో `స్లీప్ డైవ‌ర్స్‌` విష‌యంలో భార‌త్ ముందుంద‌ని తేలింది. ఇది భార‌త నాగ‌రిక వ్య‌వ‌స్థకు పెద్ద ఇబ్బందిగా మార‌నుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా స్లీప్ డైవ‌ర్స్ యాట్టిట్యూడ్ పెరిగితే.. ఆత్మ‌హ‌త్య‌ల‌కు, మానసిక రోగాల‌కు.. కుటుంబాల విచ్ఛిన్నానికి కూడా దారితీసే ప్ర‌మాదం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఏంటింది?

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఎలాంటి పొర‌పొచ్చాలు ఉండ‌వు. బాగానే మాట్లాడుకుంటారు. బాగానే క‌లిసి ఉంటారు. కానీ.. రాత్రి వేళ‌కు మాత్రం ఎవ‌రి ప‌డ‌క‌లు.. వారివి. ఎవ‌రి బెడ్ రూమ్ వారిది. త‌లుపులు వేసుకుని ఎవ‌రికి వారే నిద్రిస్తారు. కానీ, అన్యోన్య కాపురం అంటే.. కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం కాదనేది నిపుణులు చెబుతున్న‌మాట‌. క‌లివిడిగా నిద్రించ‌డం.. ఒకే బెడ్‌ను పంచుకోవ‌డం ద్వారా శారీర‌క‌, మానసిక ఆరోగ్యం కూడా దంప‌తుల్లో మెరుగ‌వుతుంద‌ని చెబుతున్నారు. కానీ, ఇటీవ‌ల 4 ఏళ్లుగా స్లీప్ డైవ‌ర్స్ అనే ట్రెండ్ బాగా పెరుగుతోంద‌ని సర్వేలో తేలింది.

ఈ జాబితాలో హైద‌రాబాద్, ముంబై, చెన్నై, తిరువ‌నంత‌పురం వ‌రుస‌గా నాలుగు స్థానాల్లో ఉన్నాయ‌ని స‌ర్వే తెలిపింది. అంటే.. ఆయా న‌గ‌రాల్లో భార్యా భ‌ర్త‌లు.. నైట్ అయ్యేస‌రికి ఎవ‌రి ప‌క్క‌ను వారు చూసుకుంటున్నారు. ఒంట‌రిగా నిద్రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. ఇలా అనుకునే వారిలో ఇద్ద‌రూ ఉండ‌ర‌న్న‌ది స‌ర్వే చెబుతున్న మాట‌. అంటే.. భార్యో, భ‌ర్తో.. ఎవ‌రో ఒక‌రు స్లీప్ డైవ‌ర్స్ కోరుకుంటున్నారు. దీంతో రెండో వారు కూడా దీనినే అనుస‌రిస్తున్నారు.

కార‌ణాలు ఏంటి?

ప్ర‌స్తుతం ప్ర‌తి కుటుంబంలోనూ(ముఖ్యంగా న‌గ‌రాల్లో జీవించేవారికి) భార్యాభ‌ర్త ప‌నిచేస్తున్నారు. ఆఫీసు ప‌నులతో అలిసిపోయి ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో ప్ర‌శాంత‌మైన నిద్ర‌ను కోరుకుంటున్నారు. క‌లివిడి ప‌డుకుంటే.. టైమ్ వేస్ట్‌ అనుకునేవారు.. గురక స‌మ‌స్యగా భావించే వారు.. మ‌ధ్య మ‌ధ్య వ‌చ్చే మెల‌కువ‌లు.. వంటివి వారిని డిస్ట‌ర్బ్ చేస్తున్నాయ‌ని త‌ల‌పోస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రికి వారు.. సైలెంట్‌గా ప్ర‌శాంతంగా నిద్ర‌పోవాల‌ని భావిస్తూ.. గ‌దుల‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.

న‌ష్టం ఏంటి?

భార్య‌భ‌ర్త వేర్వేరుగా ప‌డుకోవ‌డం వ‌ల్ల‌.. వారి మానసిక ప‌రిస్థితులు దెబ్బ‌తింటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. క‌లివిడి ప‌డుకోవ‌డం ద్వారా.. ఒక‌రిపై ఒక‌రికి విశ్వాసం.. న‌మ్మ‌కం వంటివి మ‌రింత పెరుగుతాయని.. సెక్స్‌లోనూ ఆనందంగా ఉంటార‌ని చెబుతున్నారు. అంతేకాదు.. ఒక‌రి స‌మ‌స్య‌లు ఒక‌రికి పంచుకోవ‌డం.. ప‌రిష్కారం గుర్తించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌ద్వారా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయ‌ని అంటున్నారు.

కానీ.. ఇప్పుడు స్లీప్ డైవ‌ర్స్ పెరుగుతుండ‌డంతో  ఈ స‌మ‌స్య‌లు మ‌రింత పెరిగి.. అది ఒంట‌రి త‌నానికి దారి తీసి.. ఆత్మ‌హ‌త్య‌ల‌ను ప్రేరేపిస్తున్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక‌, దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో.. ఉద్యోగాలు చేసే భార్యా భ‌ర్త‌లు ఉన్న కుటుంబాల్లో 53 శాతం మంది దంప‌తులు.. స్లీప్ డైవ‌ర్స్‌ను పాటిస్తున్నార‌ని స‌ర్వేలో తేల‌డం గ‌మ‌నార్హం.