ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ పవన్ అనే వ్యక్తి తనను తాను కాల్చుకుని మరణించాడు. తూర్పు ఢిల్లీలోని దల్లూపురా ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గన్ను లోడ్ చేసి గుండె మీద పెట్టుకుని సరదాగా ఫోజులిస్తుండగా, అనుకోకుండా ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ నేరుగా దూసుకుపోయింది. తీవ్ర గాయాలైన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు.
ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పవన్ తన స్నేహితుడితో కలిసి వీడియో తీయిస్తుండగా ఈ ఘటన జరిగింది. వీడియోలో పవన్ నవ్వుతూ తుపాకీని లోడ్ చేస్తుంటే, వెనుక నుంచి అతని స్నేహితుడు గన్ ఎలా వాడాలి అనే టిప్స్ ఇస్తుండటం గమనార్హం. “వద్దు భయ్యా.. కాల్చవద్దు” అని స్నేహితుడు హెచ్చరిస్తున్నా, పవన్ వినకుండా గన్ను తన ఛాతీకి ఆనించి నవ్వాడు. సెకన్ల వ్యవధిలోనే ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడం, పవన్ కుప్పకూలిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే తుపాకీకి లైసెన్స్ ఉందని, అది వీడియో తీస్తున్న వ్యక్తిదేనని పోలీసులు గుర్తించారు. గన్ లాక్ అయ్యిందని పవన్ పొరపాటు పడటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. నిజానికి అది లాక్ కాలేదు, దీంతో ట్రిగ్గర్ మీద వేలు పడగానే లోపల ఉన్న బుల్లెట్ నేరుగా పవన్ గుండెలోకి దూసుకెళ్లింది. కేవలం ఒక రీల్ కోసం చేసిన అతి తెలివి ప్రయోగం చివరకు ప్రాణాంతకంగా మారింది. ప్రస్తుత రోజుల్లో క్రేజ్ కోసం యువత ప్రాణాలకు తెగిస్తున్నారు. గన్లు, కత్తులు వంటి ప్రమాదకరమైన వస్తువులతో వీడియోలు తీస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఈ ఘటనలో పవన్ ప్రాణాలు పోవడమే కాకుండా, అతని స్నేహితుడు కూడా ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడ్డాడు. లైసెన్స్ ఉన్న ఆయుధాన్ని అజాగ్రత్తగా ఇతరులకు ఇవ్వడం నేరం కావడంతో, పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates