షికాగోలో హైదరాబాద్ యువకుడ్ని దారుణంగా కొట్టేశారు

హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడు అకారణంగా దాడికి గురయ్యాడు. దేశం కాని దేశంలో అమెరికాలోని షికాగో నగరంలో ఉన్న అతడు దారిదోపిడీదారుల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన సయ్యద్ మజర్ అలీ అనే యువకుడి మీద దుండగులు దాడి చేశారు. హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ లోని హాషిమ్ నగర్ లో నివసించే ఇతను కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి షికాగోకు వెళ్లాడు.

యూఎస్ లోని ఇండియానా వెస్లియాన్ వర్సిటీలో మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు చేస్తున్న అతను.. అమెరికాలో తాను నివసించే ఇంటికి సమీపంలో నడుస్తున్న వేళలో గుర్తు తెలియని దుండగలు అతని మీద దాడికి పాల్పడ్డారు. అతని నుంచి పర్సు తీసుకున్నారు. ఈ క్రమంలో అతడిపై దాడికి తెగబడ్డారు. ఇదంతా సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది.

దాడి కారణంగా తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న అతని గురించి పోలీసులకు కొందరుస్థానికులు సమాచారం ఇవ్వటంతో వారు రంగంలోకి దిగి.. అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. అతనిపై దాడి జరిగిన విషయాన్ని హైదరాబాద్ లోని అతని తల్లి.. భార్యలకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న అతన్ని మాట్లాడేందుకు భార్య.. తల్లి ఫోన్ కాల్ చేయగా.. మాట్లాడలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అతనికి అవసరమైన వైద్య సాయం అందించాలని కోరుతూ.. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు మొయిల్ చేశారు. భారత ప్రభుత్వం స్పందించి.. యూఎస్ ఎంబసీతో మాట్లాడాలని పలువురు కోరుకుంటున్నారు.