కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం అందించేందుకు సిద్ధమవుతోంది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలా అని అన్ని కేసులకు ఇది వర్తించదన్నది మర్చిపోకూడదు. డిజిటల్ మోసాలకు.. సైబర్ నేరస్తుల బారిన పడినోళ్లకు రికవరీ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతదాకా ఎందుకు? సైబర్ మోసాలకు పాల్పడే వారిని అదుపులోకి తీసుకున్నా.. వారు చేసే మోసాలకు.. వారి వద్ద రికవరీ చేసే మొత్తాలకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో ఉంటున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. బాధితులకు పాక్షిక ఉపశమనం కలిగించేలా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది.
ఇందుకు ఏం చేయాలి?
ఆర్ బీఐ తాజా ప్రతిపాదనలోని ముసాయిదా ప్రకారం ఒకవేళ బాధితుడు పిన్ నంబర్.. పాస్ వర్డ్.. ఓటీపీ తదితర కీలక సమాచారాన్ని ఇతర వ్యక్తులతో పంచుకోవటం.. ఇతర వ్యక్తులు పంపే మోసపూరిత యాప్ లనున ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవటం ద్వారా మోసాల బారిన పడినోళ్లు దీని కిందకు వస్తారు. ఇలా మోసపోయిన ఐదు పని దినాలలో సంబంధిత బ్యాంక్ లేదంటే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ (1930) నెంబర్ కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వారిని పాక్షిక పరిహారం పొందేందుకు అర్హుడిగా గుర్తించే వీలుంది.
ఎన్నిసార్లు?
ఇలా సైబర్ మోసాల బారిన పడినోళ్లు.. తమ జీవితంలో ఒక్కసారి మాత్రమే పాక్షిక పరిహారం పొందే అర్హత ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు సంబంధించిన సమాచారాన్ని దాచి ఉంచేందుకు పెద్ద ఎత్తున డిజిటల్ నిల్వ సామర్థ్యం అవసరం. ఇందుకోసం చాలా బ్యాంకులు తమ సమాచారాన్ని థర్డ్ పార్టీకి అప్పగిస్తారు. అందులో పని చేసే ఉద్యోగుల కక్కుర్తి కారణంగా.. తమ వద్ద ఉన్న సమాచారాన్ని సైబర్ దొంగల ముఠాలకు అమ్ముతుంటాయి
వివరాలు చెప్పటంతో నమ్మకం
ఇలా దొంగతనంగా సేకరించిన డేటాలోని సమచారాన్ని బాధితులకు ఫోన్ చేసి చెప్పటంతో.. అలా చెప్పిన సైబర్ దొంగల్ని బ్యాంకు అధికారులుగా నమ్మేయటం జరుగుతుంది. దీంతో.. వారు బాధితుల్ని తేలిగ్గా నమ్మిస్తారు. వారి నుంచి అందినకాడికి దోచేస్తారు.
పరిహారం ఎంత?
ఆర్ బీఐ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం చూస్తే.. సైబర్ నేరాల్లో రూ.50 వేల వరకు పోగొట్టుకున్న బాధితులను పరిహారం పొందే జాబితాలో చేరుస్తారు. అలాంటి ఉదంతాలలో బాధితులు పోగొట్టుకున్న మొత్తంలో గరిష్ఠంగా 85 శాతం లేదా రూ.25వేల మొత్తంలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని బాధితుడికి అప్పగిస్తారు. ఈ పరిహారాన్ని బ్యాంక్ తో పాటు ఆర్ బీఐ భరించనుంది.
ఎవరి వాటా ఎంత?
బాధితుడికి పరిహారం అందించే విషయంలోనూ ఆర్ బీఐ స్పష్టమైన పరిహార వాటాను సిద్దం చేసింది. ఉదాహరణకు ఒక బాధతుడికి రూ.25వేలుపరిహారం రూపంలో చెల్లించాల్సి వస్తే.. అందులో ఆర్ బీఐ రూ.19,118 తన వాటా కింద ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని (రూ.2941 చొప్పున) బాధితుడి బ్యాంక్ ఖాతా ఉన్న బ్యాంక్ తో పాటు.. నగదు బదిలీ అయిన బ్యాంక్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంత భారీగా మోసాలంటే?:
కొవిడ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో సైబర్ నేరస్తులు దీన్నో అవకాశంగా మలుచుకొని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. దీని ప్రకారం చూస్తే సైబర్ మోసాలు నమోదైన మొత్తాల్ని చూస్తే 2023లో రూ.277 కోట్లు అయితే 2024 నాటికి ఇది కాస్తా రూ.1457 కోట్లకు చేరుకుంది. 2025 నాటికి ఇది రూ.520 కోట్లుగా నమోదైంది.
మీకు ఇక్కడో సందేహం రావొచ్చు. ఏడాదికి ఏడాదికి మోసాలు పెరగటమే కానీ తగ్గలేదు కదా? మరి.. కోల్పోయిన సొమ్మును ఇంత తక్కువగా ఎందుకు చూపిస్తున్నారని. అనధికారిక సమాచారం ప్రకారం.. సైబర్ మోసాలకు సంబంధించి తక్కువ మొత్తాలు నష్టపోయిన వారి ఫిర్యాదుల్ని పోలీసులు తీసుకోని పరిస్థితి ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా గణాంకాలు ఉన్న దుస్థితి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
