టార్గెట్ 22.. ఆ రోజే పిల్ల‌ల్ని కంటాం ప్లీజ్‌!

ఇదేదో త‌మాషా విష‌యం కాదు.. నిజ‌మే. ఈ నెల 22వ తేదీనే పిల్ల‌ల్ని కంటామంటూ.. ఇప్పుడు గుజ‌రాత్ స‌హా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోని గ‌ర్భిణులు ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు వంద‌ల సంఖ్య‌లో ఉన్న గ‌ర్భిణులు.. ఈ నెల 22నే తాము పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిస్తామ‌ని తేల్చి చెబుతున్నారు. దీనికి గాను వైద్యులు ఏమైనా చేయాల‌ని వారు అభ్య‌ర్థిస్తున్నారు. ఇక‌, వ్యాపారులు కూడా.. కొత్త ప్రారంభించ‌బోయే త‌మ వ్యాపారాల‌కు ఈ నెల 22నే ముహూర్తాలు ఖ‌రారు చేసుకుంటున్నారు.

మ‌రి ఏంటి ఈ నెల 22కు ఉన్న ఆ మ‌హ‌త్తు! అంటే.. ఆరోజే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో ఉన్న రామ జ‌న్మ భూమిలో పున‌ర్నిర్మించిన రామమందిరాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించ‌నున్నారు. అక్క‌డే 51 అంగుళాల‌(సుమారు 4.25 అడుగులు) బాల రాముడి విగ్ర‌హాన్ని ఆయ‌న ప్ర‌తిష్టించ‌నున్నారు. ప్ర‌త్యేక పూజ‌ల్లోనూ పాల్గొంటారు. దీనికి గుర్తుగా.. మ‌హిళ‌లు.. ముఖ్యంగా గ‌ర్భ‌వతులుగా ఉన్న‌వారు.. అదే రోజు పిల్ల‌ల్ని క‌నాల‌ని టార్గెట్‌గా పెట్టుకోవ‌డం ఆస‌క్తిగా మారింది.

“ఆ రోజు ఎంతో ప‌విత్ర‌మైంద‌ని ప్ర‌ధాని మోడీ చెప్పారు. ఇంటింటా దీపాలు కూడా వెలిగించ‌మ‌న్నారు. రాముడి విగ్ర‌హాన్ని 500 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. ప్ర‌తిష్టించ‌నున్నారు. ఇంత‌క‌న్నా ప‌విత్ర‌దినం ఏముంటుంది? అందుకే ఆ రోజు పిల్లల్ని క‌నాల‌ని నిర్ణ‌యించారు” అని యూపీకి చెందిన ప్ర‌ముఖ పీడియాట్రిష‌న్ ఒక‌రు మీడియాకు చెప్పారు. అంతేకాదు.. ఆ రోజు కోసం.. ఇప్ప‌టికే త‌మ ద‌గ్గ‌ర ఉన్న 30 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి బుక్ అయిపోయింద‌న్నారు.

ఇక‌, గ‌ర్భ‌వ‌తులు కూడా.. ఇదే విష‌యాన్ని చెబుతున్నారు. దేశంలో పవిత్ర ప్రాంతాల్లో ఒక‌టిగా ఉన్న రామ‌జ‌న్మ‌భూమిలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి గుర్తుగా ఆరోజే పిల్న‌ల్లి కంటామ‌ని.. త‌మ‌కు పుట్ట‌బోయే బిడ్డ ఆడైనా.. మ‌గైనా.. రాముడి పేరునే పెట్టుకుంటామ‌ని చెబుతున్నారు. ఇక‌, ఉత్త‌రాది వ్యాపారులు.. కొత్త‌గా ప్రారంభించే వ్యాపారాల‌ను ఈ నెల 22నే ప్రారంభించాల‌ని నిర్ణ‌యించ‌డం మ‌రో విశేషం. మ‌రోవైపు పురోహితుల‌కు కూడా ఆరోజే డిమాండ్ ఏర్ప‌డింది. ఇదీ.. సంగ‌తి!!