హైదరాబాద్ పరువు ‘లులు’పాలు

లులు మాల్.. లులు మాల్.. వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని గురించే చర్చ. దేశంలోనే అతి పెద్దదైన మాల్స్‌లో ఒకటైన ఈ మాల్.. వాస్తవానికి విశాఖపట్నంలో ఏర్పాటు కావాల్సింది. కానీ జగన్ సర్కారు ఇబ్బందులకు గురి చేయడంతో అక్కడి నుంచి తరలివెళ్లి హైదరాబాద్‌లో ఏర్పాటు కావడంతో రాజకీయంగా కూడా దీని మీద పెద్ద చర్చ జరిగింది. ఇక ఇప్పటిదాకా ఇండియాలో చూడని భారీ హైపర్ మార్కెట్ సహా అనేక ఆకర్షణలతో ఈ మాల్ సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ మాల్ మొదలైన దగ్గర్నుంచి దాని విశేషాలతో సోషల్ మీడియా నిండిపోతోంది.

ఇక ఈ మాల్‌న చూడ్డానికి జనం మామూలుగా ఎగబడట్లేదు. ఇదేదో కొన్ని వారాలు ఉండి వెళ్లిపోయే ఎగ్జిబిషన్ అన్నట్లుగా జనం తొలి వారంలోనే వేల సంఖ్యలో మాల్‌కు వరుస కట్టేస్తున్నారు. దీని వల్ల కూకట్ పల్లి ప్రాంతంలో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం కావడం హాట్ టాపిక్ అయింది.

జనానికి ఇదేం పిచ్చి అంటూ ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక గాంధీ జయంతి రోజు జరిగిన పరిణామాలు చూస్తే షాకవ్వకుండా ఉండలేం. సెలవు రోజు కావడంతో గత కొన్ని రోజులను మించి ఈ మాల్‌కు జనం పోటెత్తారు. మాల్‌లో నిలబడటానికి కూడా చోటు లేని పరిస్థితి తలెత్తింది. జనాన్ని సిబ్బంది అస్సలు కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో దొరికింది ఛాన్స్ అన్నట్లుగా జనం ఫుడ్ ఐటెమ్స్‌ను లాగించేశారు. ర్యాక్స్‌లో ఉన్న తిండి పదార్థాలను ఎలా పడితే అలా తినేశారు. కూల్ డ్రింక్స్ ఖాళీ చేసేశారు. ఒకరిని చూసి ఇంకొకరు ఫుడ్ ఐటెమ్స్‌ లూటీకి పాల్పడ్డారు. మాల్ లోపల ఒక విధ్వంసం జరిగిన పరిస్థితి నెలకొంది. సంబంధిత దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మాల్‌కు వచ్చిన జనాల్లో పేదవాళ్లు, తిండికి గతి లేని వాళ్లేమీ ఉండరు. కొంచెం స్థితిమంతులే వస్తారు. అలాంటి వాళ్లు ఇలాంటి దారుణాలకు పాల్పడటం ఘోరం. దీని వల్ల హైదరాబాద్ పరువు పోయిందనడంలో సందేహం లేదు.